దేవరపల్లి: గౌరీపట్నంలోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు పుణ్యక్షేత్రంలో డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25వ తేదీ వరకూ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుని మరియతల్లిని ఆరాధిస్తూ దీవెనలు పొందుతున్నారు. ఈ నెల 16న పుణ్యక్షేత్రంలో ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ప్రకాష్లు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించి నవదిన జపాలు, దివ్యబలి పూజ, జపమాల ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యక్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా కట్టుదిట్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు రానున్నందున అవసరమైన పోలీస్ బందోబస్తు, మంచినీరు, భోజన వసతి, ఉచిత వైద్య శిబిరాలు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాల్లో పలువురు పీఠాధిపతులు, గురువులు పాల్గొంటున్నారు.


