గోకవరం: ఓ ఏటీఎం నుంచి మంటలు చెలరేగగా, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాల ప్రకారం.. గోకవరం ఎంపీపీ మెయిన్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఏటీఎం నుంచి దట్టమైన పొగలు రావడంతో లోపల ఎవరైనా ఉన్నారా అని తీవ్రమైన అందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయగా, లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏటీఎం టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని కారణాలను గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.


