
ఉరకలేస్తున్న వరద గోదావరి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజ్ వద్ద వరద గోదావరి ఉరకలేస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. డెల్టాలకు సంబంధించి 12,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,400, మధ్య డెల్టాకు 1,900, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపానికి 13.60 అడుగులకు చేరకున్న నీటి మట్టం అక్కడ నుంచి అదే స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,59,482 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో గురువారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రం భద్రాచలంలో 44.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. కాళేశ్వరంలో 11.68 మీటర్లు, పేరూరులో 15.32 మీటర్లు, దుమ్ముగూడెంలో 12.02 మీటర్లు, కూనవరంలో 19.86 మీటర్లు, కుంటలో 10.93 మీటర్లు, పోలవరంలో 12.70 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.69 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
ఇంటి వద్దనే పంపిణీ
రాజమహేంద్రవరం రూరల్: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను, వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం ఉదయం హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 2,35,502 మంది లబ్ధిదారులకు రూ.103,00,44,500 కేటాయించగా, రాత్రి 7.00 గంటల వరకు 2,20,592 మంది (93.67శాతం) లబ్ధిదారులకు రూ.96.18 కోట్లు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, మండల ప్రత్యేక అధికారి/జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, ఎంపీడీవో కె.ఎస్.ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి జి.కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.
అనాథ శిశువు జాడ కోసం...
కాకినాడ క్రైం: రోడ్డు పక్కన లభ్యమైన సుమారు నాలుగు నెలలు వయసున్న ఓ అనాథ ఆడ శిశువు జాడ కోసం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ రాత్రి 10.40 సమయంలో జగ్గంపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఓ ఆడ శిశువు ఏడుస్తూ ఉండడాన్ని మేడపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్ గమనించాడని తెలిపారు. శిశువుని చేరదీసి అనారోగ్యంగా ఉండడాన్ని గుర్తించి కాకినాడ జీజీహెచ్లో చేర్చి, చికిత్స అనంతరం ఆగస్టు 13వ తేదీన శిశు గృహకు అప్పగించాడని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది శిశువుని సంరక్షిస్తుండగా, బాలిక లభ్యతపై గత నెల 24న జగ్గంపేట పోలీసులు జీడీలో నమోదు చేశారన్నారు. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ జీజీహెచ్లో చేర్చామని తెలిపారు. శిశువు రక్త సంబంధీకులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సమీపంలో ఉన్న పీడీ కార్యాలయ అధికారులను లేదా 0884–2368442, 89191 23488 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
విద్యార్థులకు స్కాలర్షిప్లు
ఈ నెల ఐదున పంపిణీ చేయనున్న కాత్వా
అమలాపురం టౌన్: చదువులో ప్రతిభ కనబరుస్తున్న వెయ్యి మంది పేద కాపు విద్యార్థులకు ఈనెల 5న కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాత్వా) ఆధర్యంలో రూ.70 లక్షల విలువైన స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు జిల్లా కాత్వా అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ చేతుల మీదుగా కాత్వాకు భారీగా విరాళాలు అందజేశారు. అమలాపురంలోని కల్వకొలను వీధిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తాతాజీకి, కాత్వా ప్రతినిధులకు ఆ మొత్తాలను అందించారు. కాపు నాయకులు తాడి నరసింహారావు, బండిగుప్తాపు పాండురంగారావు, బోనం కనకయ్య, గంధం పల్లంరాజు, త్సవటపల్లి నాగబాబు, జయన సత్తిరాజు బూరి విరాళాలు అందించారు. ఈనెల 5న స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో వీటిని పంపిణీ చేయనున్నట్టు కాత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నందెపు శ్రీనివాసరావు తెలిపారు.

ఉరకలేస్తున్న వరద గోదావరి