రక్తం పంచి..ఆయువు పెంచి.. | - | Sakshi
Sakshi News home page

రక్తం పంచి..ఆయువు పెంచి..

Jun 14 2025 7:31 AM | Updated on Jun 14 2025 7:45 AM

ఆపదలో ఆదుకుంటున్న పలువురు

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

రాయవరం: రక్తదానం మహోన్నతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి, శస్త్ర చికిత్స అవసరమైన వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారుగా చెప్పవచ్చు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్‌, వివిధ రకాల సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

అన్ని దానాల్లోకెల్లా మిన్న

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అంటారు. కాని నేడు అదే మాటను అన్ని దానాల్లోకల్లా రక్తదానం మిన్న అని చెప్పుకోవాల్సి వస్తుంది. అన్నదానం చేస్తే ఒక్క పూట కడుపు నిండుతుంది. కాని రక్తదానం చేస్తే..ఒక ప్రాణం నిలబడుతుంది. ఒకప్పుడు రక్తదానం చేస్తే నీరసించి పోతారని, పాడైపోతారనే అపోహలు ప్రజల్లో ఉండేవి. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేక పోయారు. రక్తాన్ని కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే సేకరించగలుగుతున్నారు. రక్తం అందుబాటులో లేక పలువురు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. రక్తం లభ్యమైన సందర్భాల్లో కొందరు ప్రాణాపాయం నుంచి బయట పడిన సందర్భాలు ఉన్నాయి. రక్తదాతలలకు అవగాహన మరింత కల్పించాల్సిన అవసరం ఉంది. రక్తదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోరాదు. మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదాన సమయంలో కేవలం 350మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. అందువల్ల ఎటువంటి హాని కలగదు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్స్‌ వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. రక్తదానానికి ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. రక్తదానం చేస్తే హిమోగ్లోబిన్‌ శాతం పడిపోతుందనేది కూడా అపోహే అంటున్నారు వైద్యులు.

రక్తదానానికి అర్హతలు

● 18 నుంచి 60 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషులు ఎవరైనా రక్తాన్ని దానం చేయవచ్చు.

● మూడు నెలల వ్యవధితో రక్తదానం చేయవచ్చు.

● రక్తదానం చేయడానికి 12గంటల ముందు తర్వాత ఆల్కహాల్‌ తీసుకోరాదు.

● రక్తదానం చేసే వారు 45 కేజీల పైబడి బరువును కలిగి ఉండాలి.

● సీ్త్రలు రుతుక్రమం సమయంలో, గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలివ్వడం ఆపేంత వరకు రక్తదానం చేయరాదు.

● రక్తంలో హిమోగ్లోబిన్‌ కనీసం 12.5 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి.

రక్తంలో ఏం ఉంటాయి?

రక్తంలో 55శాతం ప్లాస్మా, 45శాతం సెల్స్‌ ఉంటాయి. ప్లాస్మాలో 91శాతం నీరు, 8శాతం ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌, ఒక శాతం ఇనర్గానిక్‌ మాలిక్యూల్స్‌ ఉంటాయి. సెల్స్‌లో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 5.6 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 11వేల వరకు తెల్ల రక్తకణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్‌ సరఫరాకు తోడ్పడతాయి. తెల్ల రక్తకణాలు శరీరంలో ఉండి రోగకారక క్రిములపై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి. 1.5 నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్‌ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహకరిస్తాయి.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలులో బ్లడ్‌ బ్యాంకులున్నాయి. కొత్తపేట, పి.గన్నవరం, మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, అల్లవరం, టి.కొత్తపల్లి పీహెచ్‌సీల్లో బ్లడ్‌ స్టోరేజ్‌ సెంటర్లు ఉన్నాయి. ఏడాదికి వలంటీర్‌ బ్లడ్‌ డోనర్స్‌ నుంచి 18వేల యూనిట్ల రక్తాన్ని జిల్లావ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 31 వరకు 1,093 ప్రసవాలు జరగ్గా 706 సిజేరియన్స్‌ నిర్వహించారు. వందల సఖ్యంలో మేజర్‌, మైనర్‌ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రసవాలు, ప్రమాదాలు, అత్యవసర శస్త్ర చికిత్సలు సమయంలో రక్తాన్ని వినియోగిస్తున్నారు. అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ల డోనర్స్‌ వివరాలను జిల్లా రక్తనిధి కేంద్రం సిబ్బంది సేకరించి, ఆ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వీరి ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో రక్త కొరత లేదని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఫర్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ కె.కార్తీక్‌ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, రాజకీయ సంస్థలకు చెందినవారికి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు.

23 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నా..

2002 నుంచి రక్తదానం చేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం తూర్పుగోదావరి వలంటరీ బ్లడ్‌ అండ్‌ ఐ డోనర్స్‌ క్లబ్‌ పేరుతో రక్తదానం చేస్తున్నాం. ఈ క్లబ్‌లో రోజువారీ కూలీలతో పాటు ఆటోడ్రైవర్లు, పలు వృత్తుల్లో కొనసాగుతున్న 1,500 మంది సభ్యులుగా ఉన్నారు. మా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 38 బ్లడ్‌ క్యాంపుల ద్వారా రక్తాన్ని సేకరించి, రోటరీ, రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలకు అందజేశాం.

– వెలగల ఫణికష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వలంటరీ బ్లడ్‌అండ్‌ఐ బ్యాంక్‌ చైర్మన్‌, రాయవరం

ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి

ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించడం వలన ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడినవారవుతారు. ప్రతి నెలా స్వచ్ఛంధ సంస్థల నుంచి, దాతల నుంచి రక్తాన్ని సేకరించి భద్రపరుస్తాం. అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి అందిస్తున్నాం.

– డాక్టర్‌ పి.అన్నపూర్ణ, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (పెథాలజీ), ఏరియా ఆస్పత్రి, అమలాపురం

అరుదైన బ్లడ్‌ గ్రూపులు

కొందరు అరుదైన బ్లడ్‌ గ్రూపులు కలిగి ఉంటారు. అటువంటి వారికి రక్తం అవసరమైన సందర్భంలో అదే గ్రూపు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ, ఏబీ, బీ, ఓ నెగిటివ్‌ గ్రూపులు అరుదైన గ్రూపులు. ఇటువంటి గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రమాదాలకు గురైనప్పుడు అరుదైన బ్లడ్‌ గ్రూపుల వారి నుంచి సేకరించిన రక్తాన్నే అందజేయాల్సి ఉంటుంది.

అనర్హులు ఎవరంటే...

సాధారణంగా రక్తదానం శ్వాసకోశ వ్యాధులున్న వారు, క్యాన్సర్‌, గుండెజబ్బులు, బరువు తగ్గడం, డయాబెటిక్‌, హెపటైటిస్‌, ఆస్తమా, ఎపిలెప్సీ, కాలేయ వ్యాధులు, ఎండోక్రైన్‌ సమస్యలు, ఎయిడ్స్‌ లక్షణాలు కలిగిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయరాదు. మలేరియా, టైఫాయిడ్‌ తదితర వ్యాధులకు చికిత్స పొందిన వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, రక్తదానం పొందినవారు కనీసం ఏడాది వరకు రక్తదానం చేయడానికి వీలులేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత కలిగిన వారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు ఆ విషయాల్ని వైద్యులకు చెబితే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయరాదన్న విషయాన్ని చెబుతారు.

రోగుల సేవలో తరిస్తూ..

కొత్తపేట: అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ 15 ఏళ్ల ప్రాయం నుంచీ సైకిల్‌పై మొక్కలు వ్యాపారం చేసేవాడు. ఒకసారి కడియపులంక నుంచి మొక్కలు తెచ్చుకుంటుండగా రావులపాలెం వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావమై ఇబ్బంది పడ్డాడు. కొంత కాలానికి కోలుకుని బతికి బయటపడ్డాడు. తరువాత నుంచి కొత్తపేటలో స్వామి వివేకానంద యోగాశ్రమం, హనుమాన్‌ వ్యాయామ కళాశాల నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచీ తాను స్వయంగా 24 సార్లు రక్తదానం చేయగా, తన సంస్థల స్టూడెంట్స్‌, దాతల సహకారంతో రక్తదానం చేయిస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల బంధువులు రక్తం కోసం సంప్రదించినప్పుడు సాధ్యం కాదు అనే మాట రాకుండా రక్తం ఇప్పిస్తున్నారు.

ఇతర జిల్లాలకు సైతం తీసుకువెళ్లి...

స్థానికులకే కాక స్థానికేతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు సైతం రక్తదాతలను తీసుకువెళ్లి రక్తదానం చేయిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం బ్లడ్‌ బ్యాంకుల ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగులకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లి రక్తదానం చేయించి సేవా సంస్థలు, ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు.

రక్తం పంచి..ఆయువు పెంచి..1
1/3

రక్తం పంచి..ఆయువు పెంచి..

రక్తం పంచి..ఆయువు పెంచి..2
2/3

రక్తం పంచి..ఆయువు పెంచి..

రక్తం పంచి..ఆయువు పెంచి..3
3/3

రక్తం పంచి..ఆయువు పెంచి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement