
జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ
● 11 మందికి తీవ్ర గాయాలు
● రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
దేవరపల్లి: జాతీయ రహదారిపై గుండుగొలను–కొవ్వూరు మధ్య శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన 11 మంది ఆటోలో శుక్రవారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని 11 మంది తీవ్రంగా గాయపడగా, హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉంది. గాయపడిన వారిలో పలువురు మహిళలు ఉన్నారు.