
రైతులు నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: ధాన్యం కొనుగోలు చేయకుండా, ఇన్సూరెన్స్ చెల్లించకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుంటే, మరోవైపు కేంద్రం కేవలం మూడు శాతం మాత్రమే వరిపై మద్దతు ధర పెంచడం దారుణమని మాజీ మంత్రి ,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పక్కనే ఉన్న ఒడిశా ప్రభుత్వం వరిపై కనీస మద్దతు ధరకు 800 రూపాయలు బోనస్ చెల్లించి క్వింటాల్ వరిని కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.500 అదనంగా చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు పెట్టుబడి సహాయం ఏడాదికాలంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఓవైపు పెట్టుబడులు పెరిగిపోతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాలు బంజరు భూములను కూడా వరి భూములుగా మారుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట లాక్కుంటున్నారని వేణు ఆవేదన వ్యక్తం చేశారు .
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో శాంతి భద్రతలు కూటమి ప్రభుత్వ పాలనలో దారుణంగా క్షీణించాయని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. డిబేట్లో మాట్లాడిన అంశాన్ని ఆధారంగా చేసుకుని సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ను అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులు నిర్వహించటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు నాలుగురెట్లు ఇస్తానని చెప్పిన సంవత్సరకాలంలో చేయకుండా చంద్రబాబు మహిళలను, రైతులను, అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఇప్పుడు సాక్షి డిబేట్లో ఒక ఎనలిస్ట్ అన్నమాటలకు చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకుని డైవర్షన్ పాలిటెక్స్ చేస్తున్నారన్నారు. గతంలో తన సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఎంతో మనోవేదన చెందారన్నారు. ఇప్పుడు ఏబీఎన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పై వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆయన సతీమణి భారతమ్మపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని సభ్యసమాజం తలదించుకుంటోందన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని కచ్చితంగా కూటమి పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ