అన్న చేతిలో తమ్ముడి హతం | - | Sakshi
Sakshi News home page

అన్న చేతిలో తమ్ముడి హతం

Oct 7 2024 12:14 AM | Updated on Oct 7 2024 12:18 PM

-

 ఆస్తి వివాదాలే కారణం

పి.మల్లవరంలో కలకలం

తాళ్లరేవు: ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్న చేతిలో తమ్ముడు హతమైన ఘటన పి.మల్లవరం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు, కాకినాడ రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ కథనం మేరకు.. పి.మల్లవరం పెదపేట గ్రామానికి చెందిన వెంటపల్లి నూకరాజును అతని అన్న వెంటపల్లి ఏడుకొండలు కత్తితో నరికి చంపాడు. వీరిద్దరికీ ఇంటి, ఉమ్మడి ఆస్తి వివాదాలు ఉన్నాయి. అంతేకాకుండా కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నూకరాజు ఇంటి పెరట్లోని కొబ్బరి కాయలు తీయిస్తుండగా అన్నదమ్ముల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఏడుకొండలు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో భీతావహులైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మృతుడు నూకరాజుకు భార్య నాగరత్నం, ఎనిమిదేళ్ల కుమారుడు సంతోష్‌ అభిరామ్‌, నాలుగేళ్ల కుమార్తె స్వరూప ఉన్నారు. పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు.

మూడు నెలలు.. ముగ్గురి మృతి
ఇలా ఉండగా ఆ కుటుంబంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు మృతి చెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబ యజమాని వెంటపల్లి నాగభూషణం మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, అతని భార్య మిరియమ్మ గత నెలలో మృతి చెందింది. వారం రోజుల క్రితమే ఆమె మృతికి సంబంధించి సంస్మరణ దినాన్ని నిర్వహించారు. అది జరిగి వారం గడవక ముందే ఆ కుటుంబంలో మరో వ్యక్తి మృతి చెందడం శోచనీయం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement