
లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి
బిక్కవోలు: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన పందలపాక శివారులో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడ భానుగుడి శ్రీరామ్నగర్ ప్రాంతానికి చెందిన గొల్ల మహంతి బాల వెంకటేష్ (29) పందలపాక సచివాలయం–2లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చారు. అక్కడ గ్రామస్తులతో కలసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిక్కవోలులో ఇంజినీరింగ్ కార్యాలయానికి బయలు దేరారు. తాను పనిచేస్తున్న సచివాలయం నుంచి కనీసం 400 మీటర్ల దూరంలో పందలపాక – ఊలపల్లి రోడ్డు వద్ద బిక్కవోలు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా కుడివైపు తిప్పి అతని బైక్ను కొట్టడంతో వెంకటేష్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆ లారీ వెంటనే అతని తలపై నుంచి వెళ్లిపోయింది. వెంకటేష్ తలకు హెల్మెట్ ఉన్నా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థలానికి భారీఎత్తున గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. ప్రమాద తీరును ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ పరిశీలించారు. మృతిదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించారు. మృతుడి భార్య కావ్యసత్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పందలపాకలో విషాదం
ఐదేళ్లుగా సచివాలయ ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతూ, అందరితో సరదా ఉండే ఉద్యోగి ఇలా మృతి చెందడంతో స్థానికులు మదనపడుతున్నారు. తమ్ముడు అనే పిలిచే వ్యక్తి ఇలా అకాలంగా మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ బైక్ నడిపినా హెల్మెట్ వాడేవాడని, అందరినీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేవాడని, అలాంటి వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు, గ్రామస్తులు, మిత్రులు తమ్ముడు ఇక రాడంటూ ఆవేదన చెందుతున్నారు. తల్లిదండ్రులకు ఇతనే ఒక్కగానొక్క కుమారుడు. రెండేళ్ల కిందట దగ్గర బంధువని కావ్యసత్యశ్రీతో వివాహం జరిపించారు. కుటుంబానికి ఆసరా ఉంటాడని అనుకున్న కొడుకు ఇక లేకపోవడంతో తల్లిదండ్రులు, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన భర్త ఇకలేడని తెలిసి భార్య కావ్యసత్యశ్రీ బోరున విలపిస్తున్నారు.

లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి