
మీ వ్యర్థాలు మీ ముందే..
మామిడికుదురు: గోగన్నమఠం గ్రామ ప్రధాన రహదారి పక్కన కోళ్ల వ్యర్థాలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. మగటపల్లి నుంచి గోగన్నమఠం వెళ్లాలంటే ఇక్కడ ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలోని కోళ్ల మాంసం దుకాణం యజమాని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కోళ్ల వ్యర్థాలు వేయవద్దని చెబుతున్నా వినకపోవడంతో శనివారం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అల్లు విజయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై వేసిన కోళ్ల వ్యర్థాలను మూటలు కట్టి పంచాయతీ రిక్షాపై చికెన్ షాపు వద్దకు తీసుకు వెళ్లారు. ఆ వ్యర్థాలన్నీ ఆ షాపు ముందే వేశారు. ఇక ముందు రోడ్డుపై కోళ్ల వ్యర్థాలు వేస్తే ఇదే పరిస్థితి పునరావృత్తం అవుతుందని గట్టిగా హెచ్చరించారు. చివరికి ఆ షాపు యజమాని దిగొచ్చి వ్యర్థాలను జనసంచారం లేని ప్రాంతంలో వేసేందుకు అంగీకరించడంతో సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది.
● కోళ్ల వ్యర్థాలు తీసుకెళ్లి
ఆ షాపు ముందే వేసి హెచ్చరిక
● అధికారుల వినూత్న నిర్ణయం