
భృతివిద్యాకోర్సులు!
●
● ఉపాధికి భరోసా.. భవితపై ఆశ
● ఆర్థిక స్తోమత లేనివారిని
ఆదుకుంటున్న వైనం
● ఈ నెల 30 వరకూ
తొలి దశ ఆడ్మిషన్లకు గడువు
కొత్తపేట: పదో తరగతి తరువాత ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ చదవాలని ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఆ కోర్సులలో చేరాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్తోమత, కుటుంబ నేపథ్యం వంటి కారణాలతో సతమతమవుతుంటారు. అటువంటి విద్యార్థుల కోసం 1985లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్లో ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు ప్రవేశపెట్టింది. ఇవి పూర్తిచేసిన విద్యార్థులకు వివిధ జాబ్మేళాలు, అప్రెంటిస్ మేళాల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తొందరగా లభిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జనరల్ సబ్జెక్టులతో పాటు ఈ కోర్సులను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఒకేషనల్ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్ ఇస్తున్నారు. గేమ్స్, ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్కు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు సర్టిఫికెట్తో పాటు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫికెట్ ఇస్తుంది. జూనియర్ కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఇంటర్లో చేరేందుకు మొదటి దశ ప్రవేశాలకు ఈ నెల 30 వరకూ అవకాశం ఉంది. ఇంకా ఔత్సాహికులు ఉన్నా ఆ తరువాత కూడా జాయిన్ చేసుకుంటారు.
ఏ కోర్సుతో ఏ ప్రయోజనాలంటే..
ఏ అండ్ టీ (అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్)
అక్కౌంట్స్, ఆదాయ పన్ను సంబంధిత అంశాల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవగాహన పెంచుకోవచ్చు. దీనివల్ల సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. విద్యార్థి స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది.
సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కోర్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. కంప్యూటర్కు సంబంధించిన అన్ని అవసరాలనూ తీర్చేలా విద్యార్థి తన కా ళ్లపై తాను నిలబడేలా తోడ్పడుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి కూడా ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్)
విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాథమిక, మాధ్యమిక అవగాహన అందిస్తారు. ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానికంగా గృహ, వాణిజ్య పరమైన నిర్మాణాల్లో వైరింగ్ వర్క్లో రాణిస్తూ జీవితంలో స్థిరపడవచ్చు.
ఎం అండ్ ఏఎంటీ (మెకానికల్ అండ్
ఆటోమొబైల్ టెక్నీషియన్)
వాహనాలు, యంత్రాల పని విధానంపై అవగాహన కల్పిస్తారు. ఇది చదివిన వారు స్వయం ఉపాధి పొందవచ్చు. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య చదవవచ్చు. వివిధ ఆటోమొబైల్ కంపెనీల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)
వివిధ రకాల రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలనూ అందిస్తారు. పెద్దాసుపత్రులు, మెడికల్ ల్యాబొరేటరీలలో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. లేదా సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.
ఎంపీహెచ్ఎబ్ల్యూ–ఎఫ్
(మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు)
ఈ కోర్సు అనంతరం ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లేదా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా ఉద్యోగాలు పాందవచ్చు.
ఇవికాక ఆఫీస్ అసిస్టెంట్ షిప్ (ఓఏ), సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ (సీఈటీ), లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ (ఎల్ఎంఅండ్ డీ), క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ (సీపీఅండ్ఎం), ఫిజియోథెరపీ (పీటీ), కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సీజీఏ) తదితర వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి వృత్తి విద్యా కోర్సుకు 40 సీట్లు ఉంటాయి. విద్యార్థులు ఆసక్తి చూపితే సీట్ల సంఖ్యను 60 వరకూ పెంచే అవకాశం ఉంటుంది.
జిల్లాలోని 38 ప్రైవేటు కాలేజీల్లో 5,500 ఒకేషనల్ సీట్లు ఉన్నాయి. ప్రతి కళాశాలలో పారామెడికల్ కోర్సుకు 30, ఇతర కోర్సులకు 40 చొప్పున సీట్లు కేటాయించారు.
జిల్లాలో ఇలా..
కళాశాల కోర్సుల సంఖ్య సీట్లు
కొత్తపేట 6 240
రావులపాలెం 2 80
రామచంద్రపురం 4 160
మండపేట 1 40
అమలాపురం 1 40
మలికిపురం
(ఎయిడెడ్) 2 120
మొత్తం 680
ఆర్థిక భారం లేకుండా..
మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ (ఇంగ్లిషు, తెలుగు మీడి యం) హెచ్ఈసీ (తెలుగు మీడియం) జనరల్ కోర్సులతో పాటు ఆరు ఒకేషనల్ కోర్సులు అందు బాటులో ఉన్నాయి. ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. – యాళ్ల లక్ష్మణరావు, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట
పేద విద్యార్థులకు వరం
పేద, మధ్యతరగతి విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సులు ఒక వరం. రెండేళ్లు కష్టపడి చదివితే ఉపాధి పొందే మార్గాలు అనేకం లభిస్తాయి. పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి, చదువుకోలేని విద్యార్థులు ఈ కోర్సులు అభ్యసించి, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు.
– తనికెళ్ల వీఆర్ఎస్కేఎస్ శాస్త్రి, అధ్యాపకుడు, సీఎస్ఈ విభాగం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తపేట

భృతివిద్యాకోర్సులు!

భృతివిద్యాకోర్సులు!