ఇసుకాయస్వాహా! | - | Sakshi
Sakshi News home page

ఇసుకాయస్వాహా!

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

ఇసుకా

ఇసుకాయస్వాహా!

సాక్షి, అమలాపురం: గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. వర్షాలు, వరదల సీజన్‌ మొదలు కావడంతో అధికారిక ఇసుక ర్యాంపులలో తవ్వకాలు నిలిపివేయడం, స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక లభ్యత తక్కువగా ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. వర్షాలు లేకపోవడంతో ఇసుకకు నెలకొన్న డిమాండ్‌కు తోడు.. ర్యాంపులోకి వెళ్లే దారులకు ఇబ్బందులు లేకపోవడంతో అక్రమార్కులు బరి తెగించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి నదీపాయల్లో ఇసుక దందా జోరందుకుంది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీపాయాల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలో ర్యాంపులు ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఇసుక దందా ఆగలేదు. ఇప్పుడు ర్యాంపులు మూతపడడంతో మరింత చెలరేగిపోతున్నారు. అనువుగా ఉన్నచోట గుర్తించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు పడితే మట్టి తవ్వకాలు జరిగే అవకాశం లేదు. పైగా ర్యాంపులు వేసి ఇసుక, మట్టి తవ్వకాలు చేయలేరు. వర్షాలు లేక వాతావరణం కలిసి రావడం అక్రమార్కులకు వరంగా మారింది.

పి.గన్నవరంలో మరింత దోపిడీ

పి.గన్నవరం మండలంలో ఈ దోపిడీ మరింత పెరిగింది. కీలక ప్రజాప్రతినిధుల వత్తాసుతో అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక, మట్టి వంటి సహజ వనరుల దోపిడీ నిర్విఘ్నంగా సాగిపోతోంది. మండల పరిధిలోని ఊడిమూడి, మానేపల్లి, కందాలపాలెం ప్రాంతంలో లంక మట్టి, ఇసుక, తువ్వ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది సిండికేటుగా మారి ఇక్కడ అక్రమ దందా చేస్తున్నారు. అపరాధ రుసుము చెల్లించాలని వీరికి అధికారులు నోటీసులు జారీ చేసినా దందా మాత్రం ఆగడం లేదు. మండలంలో పెద కందాలపాలెం, ఎల్‌.గన్నవరం పరిధిలో యర్రంశెట్టివారిపాలెం లంక, ఊడిమూడిలంక, మానేపల్లిలో ఇసుక, మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బెల్లంపూడిలంకలో ఒక వారం రోజులు తవ్వకాలు చేశారు. స్థానికుల నుంచి ఒత్తిడి రావడంతో నిలిపివేశారు.

నదీ గర్భంలో లోతుగా..

అక్రమ దందాకు తోడు నిబంధనలు తోసిరాజని నదీ గర్భంలో లోతున తవ్వకాలు చేయడం గమనార్హం. మీటరు నుంచి రెండు మీటర్ల లోతున తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల సమీప గ్రామాల ఉనికే ప్రమాదభరితంగా మారింది. వై.వి.పాలెం ఏటిగట్టు దిగువన, ఊడిమూడి తదితర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షాలు వస్తే సాధ్యం కాదన్న ఉద్దేశంతో తవ్వకాల్లో జోరు పెంచారు. ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తప్పదన్నట్టుగా అప్పుడప్పుడూ దాడులు చేసి జేసీబీలు, లారీలను సీజ్‌ చేస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. చీకటి పడితే చాలు అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వారు లెక్క చేయడం లేదు. దోపిడీ మరింత వేగంగా సాగిపోతోంది.

అపరాధ రుసుము అంటూ అధికారుల హంగామా

పి.గన్నవరంలో సాగుతున్న ఈ అక్రమ ఇసుక దందా సిండికేటుగా మారింది. ఒక మహిళా సర్పంచ్‌ భర్త, ఒక మండల స్థాయి నేత కుమారుడు, కూటమి పార్టీకి చెందిన నాయకులు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని ఇప్పుడు గుర్తించిన అధికారులు తవ్వకాలు చేస్తున్నవారి వద్ద నుంచి అపరాధ రుసుము రూ.2.31 కోట్లు వసూలు చేస్తామని చెబుతున్నారు. అయితే గనుల శాఖకు చెందిన అధికారులు గతంలోనూ ఇదే విధంగా అపరాధ రుసుము అంటూ హడావుడి చేసినా అక్రమార్కులు చెల్లించిన పాపాన పోలేదు.

రాజోలుకు పాకింది

గోదావరి నదీపాయల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఇప్పుడు పి.గన్నవరం నియోజకవర్గం దాటి రాజోలు నియోజకవర్గంలోనూ విస్తరించాయి. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం దిండిలో తవ్వకాలు మొదలయ్యాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. బ్యాక్‌ వాటర్‌ కారణంగా ఇక్కడ పడవల మీద ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న ఇసుక స్థానికంగా కన్నా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాలకు అధికంగా ఎగుమతి అవుతోంది.

పి.గన్నవరం మండలం బెల్లంపూడిలంక వద్ద మట్టి తవ్వకాలు (ఫైల్‌)

మళ్లీ జోరందుకున్న దందా అధికారిక ర్యాంపుల్లో నిలిచిన తవ్వకాలు ఇదే అదనుగా అనధికార ర్యాంపులు

పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో అక్రమ తవ్వకాలు అదనంగా రాజోలు, అయినవిల్లిలో కూడా..

ఒకవైపు అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ శాఖ పరిశీలన... మరోవైపు ఆగని తవ్వకాలు

ఇసుకాయస్వాహా!1
1/1

ఇసుకాయస్వాహా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement