
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాలుమూరి సాగర్, కానూరు అగ్రహారానికి చెందిన కర్సినపు ప్రవీణ్ కుమార్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం, కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తగరపు వెంకట్, వర్దణపు మణి తదితరులు మూడు కిలోల గంజాయిని రవాణా చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరందరూ పెరవలిలోని హిందూ శ్మశానవాటిక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. అనుమానంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి దొరికింది. దానితో పాటు రెండు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తణుకు కోర్టులో మంగళవారం హాజరు పరిచారు.
గంజాయి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
కోరుకొండ: గంజాయి కేసులో ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను కోరుకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు కేజీల గంజాయిని కోరుకొండ మండలం అయ్యన్నగళ్లు వద్ద పంచుకుంటుండగా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆ సమయంలో ఐదుగురు దొరికారని, ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ పరారయ్యాడన్నారు. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన నరేష్ కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలిపారు. కాగా.. నరేష్ను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్సై కూన నాగరాజు, కానిస్టేబుల్ ఉదయ భాస్కర్, ప్రసాద్ అభినందించారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు