నేటి నుంచి రత్నగిరికి భక్తుల తాకిడి | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రత్నగిరికి భక్తుల తాకిడి

Published Sat, Nov 18 2023 1:38 AM

సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు - Sakshi

ఈ మూడు రోజుల్లో 2 లక్షల

మంది వచ్చే అవకాశం

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఏటా కార్తిక మాసంలో నాగుల చవితి తరువాత రత్నగిరికి భక్తులు పోటెత్తడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగుతుందనే అంచనాతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం కార్తిక శుద్ధ పంచమి, ఆదివారం సెలవు, ఆ మర్నాడు కార్తిక మాసంలో తొలి సోమవారం. దీంతో ఈ మూడు రోజులూ సుమారు రెండు లక్షల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 20 వేల మందికి పైగా సత్యదేవుని వ్రతాలు చేసుకుంటారని భావిస్తున్నారు. దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేవస్థానంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం శుక్రవారం కిటకిటలాడింది. ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు జరిగాయి.

Advertisement
Advertisement