రిచ్మండ్: అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర డిప్యూటీ హత్య కేసులో నిందితుడు మైఖేల్ పకెట్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మే 29న రాత్రి వర్జీనియాలోని కారోల్ కౌంటీలో వెల్ఫేర్ చెక్ కోసం వెళ్లిన అధికారులపై మైఖేల్ పకెట్ కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో డిప్యూటీ లోగాన్ ఉట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం పకెట్ అడవి మార్గంలో పరారవడంతో, అధికారులు గాలింపు చేపట్టారు.
అసలేం జరిగింది?
వెల్ఫేర్ చెక్ కోసం వెళ్లిన అధికారులపై పకెట్ అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో డిప్యూటీ లోగాన్ ఉట్ మరణించగా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా మరో అధికారి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారై పోలీసులకు సవాలు విసిరాడు.
టెక్నాలజీతో చిక్కిన హంతకుడు
సుమారు రెండు రోజుల పాటు వర్జీనియా-నార్త్ కరోలినా సరిహద్దుల్లో పకెట్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు ఆదివారం ఉదయం సర్రీ కౌంటీలోని గ్రీన్హిల్ రోడ్లో ఏర్పాటు చేసిన వైల్డ్లైఫ్ కెమెరాలో పకెట్ కదలికలను గుర్తించారు. ఈ కీలక ఆధారంతో అప్రమత్తమైన ఎఫ్బీఐ, యూఎస్ మార్షల్స్, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హీరోను కోల్పోయిన కారోల్ కౌంటీ
ప్రాణాలు కోల్పోయిన లోగాన్ ఉట్ మాజీ మిలిటరీ వెటరన్. 2023లో కారోల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో చేరిన ఆయన, అంతకుముందు మౌంట్ ఎయిరీలో ఫైర్ ఫైటర్గా సేవలందించారు. అంకితభావం కలిగిన అధికారిని కోల్పోవడం కారోల్ కౌంటీకి తీరని లోటని షెరీఫ్ కెవిన్ ఎ. కెంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మరో వివాదంలో ఎన్టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు


