పాపం పసిపాప.. అక్షరాభ్యాసం కోసం వెళ్లి వస్తుండగా

One Year Ols Child Died As Car Crashes Into An Electric Pole At Kasipet Mandal - Sakshi

సాక్షి, మెదక్‌/వరంగల్‌: అభం శుభం తెలియని ఓ పసిపాప తండ్రి అజాగ్రత్తకు మృత్యుఒడికి చేరింది. అక్షరాభ్యాసం కోసం బాసరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న చిన్నారి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మాసాయిపేట మండలం స్టేషన్‌ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన వికాస్‌రెడ్డి తన కుటుంబంతో హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో భార్య ప్రవల్లిక, ఇద్దరు కూతుర్లు సాన్విక, ఏడాదిన్నర అద్విక, మరో వ్యక్తితో కలిసి బాసర సరస్వతి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం తన కారులో వెళ్లారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి హైదరాబాద్‌ వెళ్తుండగా మాసాయిపేట మండలం స్టేషన్‌ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులోంచి రోడ్డుపై పడిన చిన్నారి అద్విక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా వారికి గాయాలయ్యాయి. వికాస్‌రెడ్డి సోదరుడు విపుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు.


నుజ్జునుజ్జయిన కారు 

అతివేగమే ప్రమాదానికి కారణం
అతివేగం, అజాగ్రత వల్లే కారు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రహదారిపై అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొనడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో అప్పటివరకు తల్లి చెంతనున్న చిన్నారి అద్విక ఒక్కసారిగా ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలపాలై మృత్యుడికి చేరింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top