పాకిస్తాన్ డ్రగ్స్ సామ్రాజ్యంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అదే అన్మోల్ అలియాస్ ‘పింకీ’. మోడలింగ్ రంగంలో మెరిసిపోవాలని ఆశపడిన ఒక సాధారణ యువతి, ఎలా కోకైన్ సిండికేట్కు రాణిగా మారింది? పోలీసుల కళ్లు గప్పి 17 ఏళ్ల పాటు డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఎలా ఏలింది? ఇప్పుడు రాజకీయ నేతల పేర్లను బయటపెడుతూ పాక్ వ్యవస్థను ఎలా షేక్ చేస్తోంది?
కలల ప్రపంచం నుండి ‘చీకటి’ లోకానికి..
బలూచిస్థాన్కు చెందిన అన్మోల్, తన అందంతో మోడలింగ్ రంగంలో నిలదొక్కుకోవాలని కరాచీకి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో రాణించాలని ప్రయత్నించిన ఆమెకు, కరాచీలోని హై-ప్రొఫైల్ పార్టీలు, డ్రగ్స్ సంస్కృతితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, హంగులతో కూడిన జీవనశైలిపై ఏర్పడిన వ్యామోహం ఆమెను మెల్లమెల్లగా మాదకద్రవ్యాల వైపు నెట్టాయి. ఒక మోడల్గా ప్రయత్నించి విఫలమైన ఆమె, ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.
సామ్రాజ్య విస్తరణ: రహస్య నెట్వర్క్
పింకీ డ్రగ్స్ నెట్వర్క్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో వేళ్లూనుకుంది. తన గ్యాంగ్లో మహిళలను క్యూరియర్లుగా వాడుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, నేరుగా డెలివరీ చేసే అధునాతన పద్ధతిని ఆమె అనుసరించింది. పింకీ స్వయంగా డ్రగ్స్ తయారీలోనూ, వాటి నాణ్యతను పరీక్షించడంలోనూ శిక్షణ పొందిందని, తన వద్ద ఉన్న ‘వైట్’, ‘గోల్డెన్ స్టఫ్’ అత్యుత్తమమైనవని ఆమె గర్వంగా చెప్పుకునేదని పోలీసులు తెలిపారు.
అరెస్టు: సంచలన నిజాల వెల్లడి
2026, మే 12న కరాచీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో పింకీ అరెస్టయింది. ఆమె వద్ద కోకైన్ హైడ్రోక్లోరైడ్, కెటామైన్, వివిధ రసాయనాలు భారీ మొత్తంలో దొరికాయి. విచారణలో ఆమె గత 17 ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించగలిగిందని తేలింది. ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు విచారణ ముమ్మరంగా సాగుతోంది.
కోర్టులో వీఐపీ వేషధారణ
అరెస్టు తర్వాత పింకీ ప్రవర్తన, పోలీసుల పనితీరు తీవ్ర చర్చకు దారితీసింది. కోర్టులో ఆమె సంకెళ్లు లేకుండా, నల్ల కళ్ళద్దాలతో ఫోన్ వాడుతూ కనబడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యక్తికి ఇంతలా వీఐపీ ట్రీట్మెంట్ ఎలా లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో, ఆమెకు సహకరించిన ముగ్గురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
మాజీ ప్రధాని పేరుతో రాజకీయ ప్రకంపనలు
పింకీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. విచారణ సందర్భంగా మాజీ ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ పేరును ఆమె ప్రస్తావించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం దేశ రాజకీయాలను కుదిపేసింది. అష్రఫ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, కేసు దర్యాప్తులో పింకీ వెల్లడించే మరిన్ని పేర్లు ఎవరికి చిక్కులు తెచ్చిపెడతాయోనన్న భయం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు పింకీ కేసులో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలను వెలికితీసే పనిలో ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, వీఐపీ సంస్కృతి, రాజకీయ అధికారం ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటున్నాయనేది పింకీ ఉదంతం మరోసారి నిరూపించింది.
ఇది కూడా చదవండి: శ్రీనగర్లో ఎనిమిదో ఏటా ఈద్ ప్రార్థనలకు నో ఎంట్రీ


