శ్రీనగర్: శ్రీనగర్లోని చరిత్రాత్మక ఈద్గా, జమా మసీదులో ఈద్ ప్రార్థనలను నిర్వహించేందుకు స్థానిక అధికారులు ఈసారి కూడా అనుమతి నిరాకరించారు. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఈ ఆంక్షలు కొనసాగాయి. మరోవైపు ఈద్ పండుగ రోజున తనను గృహ నిర్బంధం చేశారని మత పెద్ద మీర్వాజ్ ఉమర్ ఫరూక్ వెల్లడించారు. ప్రార్థనల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అధికారులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, గత ఎనిమిది ఏళ్లుగా కశ్మీరీ ముస్లింలు తమ సంప్రదాయబద్ధమైన ప్రార్థనా స్థలాలను వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బారికేడ్లు, తాళాలు.. ఆంక్షల నీడలో పండుగ
పండుగ వేళల్లో ప్రార్థనల కంటే భద్రతాపరమైన ఆంక్షలే కనిపిస్తున్నాయని మీర్వాజ్ విమర్శించారు. మసీదుల ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళాలు వేయడం ద్వారా ప్రజలను అడ్డుకోవడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది పరిపాలన కాదని, ప్రజల మతపరమైన హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా ఆయన అభివర్ణించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల కశ్మీర్లోని పిల్లలు, యువత పండుగలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతికి దూరమవుతున్నారని మీర్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్గా వంటి చారిత్రక ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల సంప్రదాయం కనుమరుగవుతుండటం బాధాకరమని అన్నారు.


