తండ్రికి ఫోన్ చేసి కూతురు ఆత్మహత్య
భవాని మృతదేహం
రాజేంద్రనగర్ : భర్తతో పాటు అత్త వేధింపులు రోజురోజుకూ అధికమయ్యాయని.. ఇక తాను భరించలేనని ఓ వివాహిత తన తండ్రికి ఫోన్ చేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన మేరకు.. సికింద్రాబాద్కు చెందిన భవాని (26) రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్లు ప్రేమించి 2025 లో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ స్థానికంగా వెల్డింగ్ షాప్ లో పనిచేసేవాడు.
పెళ్లయిన తరువాత భవాని అత్త కనకమ్మ రోజూ తాగి వచ్చి కోడలితో గొడవకు దిగేది. భర్త శ్రీకాంత్కు చెప్పినా పట్టించుకోకుండా తల్లికి వత్తాసు పలికేవాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ సొంత ఊరు అయిన సిద్దిపేటలో శుభకార్యం ఉండడంతో భార్యాభర్తలతో పాటు అత్త గ్రామానికి వెళ్లారు. అక్కడ అత్త భవానీని బంధువుల ముందే తిట్టి అవమానించింది. ఈనెల 30న తిరిగి వచ్చారు.
ఆరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో భవాని తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి .. వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయని ఇక తాను భరించలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపి ఫోన్ కట్ చేసింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎల్లయ్య ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


