పనిమనిషిపై మోజు... కటకటాలపాలు

Man Assassination With Extramarital Affair In Tadepalli Rural - Sakshi

ఆమె భర్తను చంపేందుకు ప్రణాళిక 

లక్ష రూపాయల సుపారీ ఇస్తానంటూ ఐదుగురు యువకులకు ఆశ 

పట్టిచ్చిన గోపీ అనే పేరు 

వివరాలు వెల్లడించిన తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం

సాక్షి, తాడేపల్లిరూరల్‌: పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు అతని వద్ద పనిమనిషిగా పనిచేస్తున్న యువతిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో ఆమె భర్తను అంతమొందించడానికి వేసిన పథకం బెడిసికొట్టి చివరకు కటకటాలపాలయ్యాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు వినోద్, బాలకృష్ణ, ఐటీకోర్‌ సిబ్బంది బాలరాజు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.  వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి బాసుల అచ్యుతరావు, అతని భార్య కుటుంబపోషణ నిమిత్తం విజయవాడకు వలస వచ్చారు.

విజయవాడ మాచవరం డౌన్‌లో నివాసం ఉంటూ అచ్యుతరావు ప్లంబర్‌గాను, అతని భార్య ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అచ్యుతరావు మద్యానికి అలవాటు పడి డబ్బులు ఇవ్వకుండా పిల్లలను, భార్యను చితకబాదుతున్నాడు. అచ్యుతరావు భార్య విజయవాడ మాచవరం డౌన్‌లో సాయిసూర్య రెసిడెన్సీలో రెండో ఫ్లోర్‌ ఏ బ్లాక్‌లో నివాసం ఉంటున్న యామర్తి సుబ్బారావు ఇంట్లో పనిచేస్తూ వంట కూడా చేస్తుంది. ఒంటరిగా ఉంటున్న సుబ్బారావు ఆమెపై మోజుపడి, తన కోరిక తీర్చాలని అడగ్గా, ఆమె ఒప్పుకోకుండా తన భర్తకు తెలిస్తే నిన్నూ, నన్నూ చంపేస్తాడని చెప్పింది. దాంతో సుబ్బారావు ఎలాగైనా అచ్యుతరావు అడ్డు తొలగించుకోవాలని తన స్వగ్రామమైన దుగ్గిరాల మండలం చిలువూరులో నివాసం ఉండే బండ్లమూడి వేణును సంప్రదించాడు.

అనంతరం దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన గోపి చిలువూరులో షాపు నడుపుతుండగా అక్కడకు వెళ్లి ఒకతన్ని హత్య చేయాలి, దాని నిమిత్తం లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడంతో, వీరిద్దరూ కలిసి మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి సాంబిరెడ్డిని, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన కన్నెకాపురం గోపి, తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన కాసరనేని వాసుదేవ్‌ను కలిసి మాట్లాడుకొని విజయవాడలోఉన్న యామర్తి సుబ్బారావు దగ్గరకు వెళ్లి డీల్‌ కుదుర్చుకున్నారు. అదేరోజు సాయంత్రం అచ్యుతరావు తన భార్యను ఇంట్లో పనిచేయడానికి దించుతుండగా, మార్గమధ్యంలో పెట్రోల్‌ అయిపోవడంతో, భార్యను పంపి అక్కడే నుంచున్నాడు.  చదవండి: ('రమ్యశ్రీని కొట్టి చంపేశారు..')

కిడ్నాప్‌ చేసింది ఇలా... 
అచ్యుతరావు మాచవరం డౌన్‌లో నిలబడి ఉండగా, స్కూటీ వేసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్న అచ్యుతరావును మా బండిని గుద్దావు, రమ్మంటూ పట్టుకుని స్కూటీపై ఎక్కించి నలుగురూ కలిసి కనకదుర్గవారధి దగ్గరకు వచ్చి, అక్కడనుంచి తాడేపల్లి మీదుగా రేవేంద్రపాడు, సీతానగరం బకింగ్‌హామ్‌ కెనాల్‌పై గుండిమెడ కొత్త రోడ్డులోకి తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరు కలిసి అచ్యుతరావును చితకబాదారు. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..)

చంపాలని ప్రయత్నం చేస్తూ గోపీ తెచ్చిన కత్తితో పీక కోసే క్రమంలో మొహంపై తీవ్రంగా తెగింది. దాంతో అచ్యుతరావు పెద్దగా కేకలు వేయగా, ఆ రోడ్డులో ప్రయాణించే వారు ఆగడంతో అక్కడనుంచి ఐదుగురు నిందితులు పరారయ్యారు. అనంతరం తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేసే క్రమంలో బాధితుడైన అచ్యుతరావును ప్రశ్నించగా ద్విచక్రవాహనంపై వచ్చేటప్పుడు జరిగిన సంభాషణ చెప్పాడని పోలీసులు తెలిపారు. 

పట్టిచ్చిన గోపీ అనే పేరు 
కేసు నమోదు చేసే సమయానికి ఎటువంటి ఆధారాలు లేవని, అచ్యుతరావును తీసుకొచ్చేటప్పుడు గోపీ అన్నకు ఫోన్‌ చెయ్‌ అని మాట్లాడడం, ఇదే క్రమంలో హత్యకు ప్రయత్నం చేసిన సమయంలో అచ్యుతరావును తన భార్యకు ఫోన్‌చేసి లక్ష రూపాయలు తెప్పించమని డిమాండ్‌ చేయడం, ఆమె దగ్గర ఫోన్‌ లేకపోవడంతో,  ప్రధాన నిందితుడు యామర్తి సుబ్బారావుకు ఫోన్‌ చేసి తన భార్యకు ఫోన్‌ ఇవ్వాలని చెప్పానని, నిందితులు లక్ష రూపాయలు పంపమని అడిగారని అచ్చుతరావు తెలిపారు.  చదవండి: (పట్టపగలే నడిరోడ్డుపై దారుణం)

ఈ క్రమంలో ప్రధాన నిందితుడు యామర్తి సుబ్బారావు ఫోన్‌ డేటా పరిశీలించగా, హత్యకు ప్రయత్నించే ముందు, తర్వాత గోపీ ఫోన్‌కు పలుసార్లు ఫోన్‌ చేయడంతో అనుమానం వచ్చి సుబ్బారావును విచారించగా, జరిగిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ అంకమ్మరావు తెలియజేశారు. ఈ క్రమంలోనే అచ్యుతరావు రెండు ఫోన్‌లు రేవేంద్రపాడు వద్ద కాల్వలో పడేశారని, అక్కడనుంచి కూడా పలుసార్లు సుబ్బారావుతో ఈ ఐదుగురు ఫోన్‌లో మాట్లాడారని, దీని ఆధారంగానే విచారించగా సుపారీ ఇచ్చి హత్య చేయాలని ప్రయత్నించినట్లు వెల్లడైందన్నారు. హత్యకు ప్రేరేపించిన సుబ్బారావు పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, మిగిలిన నిందితులు ఐదుగురిలో కన్నెకాపురం గోపీ మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఎంఎల్‌టీ రెండో సంవత్సరం చదువుతున్నట్టు తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ అంకమ్మరావు తెలిపారు.  చదవండి: (భార్య పుట్టింటికెళ్తే.. భర్త గోదావరిలో దూకి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top