మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు? | Madhapur Drugs Case: Key Facts In Film Financier Venkat Whatsapp - Sakshi
Sakshi News home page

మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు?

Published Fri, Sep 1 2023 9:55 AM

Madhapur Drugs Case: Key Facts In Cine Financier Venkat Whatsapp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్‌ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్‌ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్‌ను అమ్మకాలు చేసినట్లు బాలాజీ, వెంకట్‌లు అంగీకరించారు. ఆ 18 మంది ఎవరు, అందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

గతంలో సినీ నిర్మాత కేసీ చౌదరి అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. కేపీ చౌదరి లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేపీ చౌదరి వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్దం అవ్వగా, దర్యాప్తుకు సమయంలో పైస్థాయి నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చింది.

ఇప్పుడు.. బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా ? ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. కేపీ చౌదరికి సినీ ఫైనాన్షియర్‌ వెంకట్‌, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్‌ తీగ లాగితే..
టీఎస్‌–నాబ్‌ అధికారులకు గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్‌ తీగ లాగితే... మాదాపూర్‌ విఠల్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ సహా ముగ్గురిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 18 మంది కస్టమర్లు, నలుగురు డ్రగ్‌ పెడ్లర్స్‌ కోసం గాలిస్తున్నట్టు టీఎస్‌–నాబ్‌(తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) ఎస్పీ (వెస్ట్‌) డి.సునీతరెడ్డి గురువారం వెల్లడించారు.

నేవీ నుంచి బాలాజీ బయటకొచ్చాక... 
నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్‌ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్‌ఫిట్‌ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్‌ అపార్ట్‌మెంట్‌లోని సర్వీస్‌ ఫ్లాట్‌లో జరిగే రేవ్‌ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్‌తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి.

ఆపై రేవ్‌ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌ హౌస్‌ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పారీ్టలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కూడా...:
గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన కె.వెంకటరమణారెడ్డి గతంలో జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ గెస్ట్‌హౌస్‌ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకటరమణారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచి్చన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్‌ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌గా మారాడు.

డమరుకం, కిక్, బిజినెస్‌మ్యాన్, లవ్లీ, ఆటోనగర్‌ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్‌ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్‌ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్‌ పారీ్టలు నిర్వహించే వారికి ఫైనాన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకటరమణారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో బుధవారం రాత్రి మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు.

గుడిమల్కాపూర్‌లో చిక్కిన బాలాజీ:
రేవ్‌ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్‌–నాబ్‌కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేష్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్‌ ఫ్లాట్‌ విషయం చెప్పా డు. దీంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఫ్లాట్‌ పై దాడి చేశారు.

అక్కడ వెంకటరమణారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీ వద్ద సీనియర్‌ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్‌ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్‌ టేబుల్‌పై ప్లేట్‌లో ఉంచిన కొకైన్‌ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్‌–నాబ్‌ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్, 25ఎక్స్‌టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్‌ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు.

స్నాప్‌చాట్‌లో కోడ్‌ నేమ్స్‌  
డ్రగ్‌ పెడ్లర్‌గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్‌మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్‌ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్‌ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్‌ వంటి కోడ్‌ నేమ్స్‌తో ఉన్నాయి.

ఆ కాంటాక్ట్స్‌లో ఫోన్‌నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్‌ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రమణారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్‌మెంట్‌లోని సర్వీస్‌ ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కారు.
చదవండి: గందరగోళంగా కోరుట్ల దీప్తి కేసు..

Advertisement
Advertisement