ఒక్క అంకె రూ. 50 వేలు నష్టం

Homeguard Loss Fifty Thousand Rupees Google Pay Transaction Bank Deposit - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌ పేలో నగదు చెల్లించే సమయంలో ఎదుటి వారి ఫోన్‌ నంబర్‌లో ఒక్క అంకె తేడా వేయడం రూ. 50 వేలు నష్టపోవడానికి కారణమైంది. పొరపాటున మరో ఖాతాలో పడిన ఈ మొత్తాన్ని ఆ బ్యాంక్‌ జమ చేసుకుంది. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.  

► బాధితుడు ఓ డీసీపీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. తన గూగుల్‌ పే ఖాతా నుంచి ఓ నంబర్‌కు రూ. 50 వేలు పంపాలని భావించారు.  

► ఈ పనిని తన కుమార్తెకు అప్పగించారు. ఆమె ఆ ఫోన్‌ నంబర్‌లో చివరి అంకె తప్పుగా కొట్టారు. ఫోన్‌ నంబర్‌ సరిచూసుకోకుండానే పే చేసేశారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌కు లింకైన బ్యాంకు ఖాతాకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం వెళ్లిపోయింది.  

► కాస్త ఆలస్యంగా ఈ విషయం గుర్తించిన బాధితుడు నగదు వెళ్లిన ఫోన్‌ నంబర్‌లో సంప్రదించారు. అయితే అప్పటికి తన ఖాతాలో రూ. 15 వేలు మాత్రమే ఉన్నాయంటూ సమాధానం వచ్చింది. అసలేం జరిగిందో అర్థం కాని ఆ వ్యక్తి బ్యాంకునకు వెళ్లి ఆరా తీశారు. సదరు బ్యాంకు నుంచి అతగాడు తీసుకున్న గోల్డ్‌ లోన్‌కు సంబంధించిన అసలు, వడ్డీ చాన్నాళ్లూగా పెండింగ్‌లో ఉండి బకాయి పెరిగిందని, ఈ నేపథ్యంలోనే ఖాతాలో రూ. 50 వేలు పడిన మరుక్షణం ఖాతాదారుడినైన తన అనుమతి కూడా లేకుండానే బ్యాంకు రూ. 35 వేలు జమ చేసుకున్నట్లు వెల్లడైంది.  

► ఇదే విషయాన్ని నర్సీపట్నం వ్యక్తి నగరానికి చెందిన హోంగార్డుకు చెప్పారు. దీంతో ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. సదరు బ్యాంకు అధికారులకు లేఖ రాసి సంప్రదించడం ద్వారా తన డబ్బు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు.

చదవండి:  వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని..

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top