‘బండి’పోట్లు.. దొరికారు!

15 Members Arrest in Bike Robbery Case Hyderabad - Sakshi

మూడు కమిషనరేట్లలో 77 ద్విచక్ర వాహనాల చోరీ 

నిజామాబాద్‌లోని సూత్రధారులు చెప్పినట్లు చోరీలు 

ఏ వాహనం కావాలంటేఅది తస్కరిస్తున్న ముఠాలు 

ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా అక్కడకుతరలించి  విక్రయాలు 

టార్గెట్‌ చేసినవి అన్నీఎన్‌ఫీల్డ్‌ సహా ఖరీదైన బైక్సే 

15 మందిని అరెస్టు చేసిన కార్ఖానా పోలీసులు 

కంటోన్మెంట్‌: తీగలాగితే డొంకంతాకదిలింది... ఒక్క బైకు దొంగను పట్టుకుంటే మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన77 బైకు దొంగతనాలు బయటపడ్డాయి. పోలీసుల చాకచక్యంతో బైకు దొంగలముఠా గుట్టు రట్టయింది. గత నాలుగైదు నెలల్లోనే చోరీకి గురైన ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రధాన నిందితులు  మొహసీన్, అమీనుల్లా, అక్బర్‌ గ్యాంగ్‌లకు చెందిన 15 మంది దొంగలను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవారం కార్ఖానా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

ఎలా దొరికారంటే? 
కార్ఖానా పోలీసు స్టేషన్‌ పరిధిలో టీవీఎస్‌ స్పోర్ట్స్‌ బైకు చోరీని చేధిస్తున్న క్రమంలో పోలీసులు ముషీరాబాద్‌కు చెందిన ఆదిల్‌ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని విచారణలో భాగంగా మోహసిన్‌ అనే మరో బైకుల దొంగతో కలిసి ఆదిల్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. మోహసీన్‌  వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఆరు బైకు దొంగతనాలకు పాల్పడి ఈ ఏడాది మార్చి 31 అరెస్టు అయ్యి, మే 21న జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే తన గ్యాంగులోని ఐదుగురు అనుచరులు షోయెబ్, సైఫ్, హఫీజ్, ఫైజాన్, సుభాన్‌లతో కలిసి మరో 15 దొంగతనాలకు పాల్పడ్డాడు. కార్ఖానా పోలీసు స్టేషన్‌ పరిధిలో చోరీ చేసిన వాహనాన్ని మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అబ్దుల్లాకు విక్రయించినట్లు మొహసీన్‌ వెల్లడించాడు. కార్ఖానా పీఎస్‌ పరిధిలోని వాహనంతో పాటు అబ్దుల్లా నుంచి మరో నాలుగు చోరీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఉస్మాన్‌ గంజ్‌లోని హిందుస్థాన్‌ పార్సిల్‌ సర్వీసెస్‌ ద్వారా నిజామాబాద్‌కు చెందిన అక్బర్‌కు ఓ చోరీ వాహనాన్ని తరలించినట్లు గుర్తించారు. ఈ మేరకు హిందుస్థాన్‌ పార్సిల్‌కు సంబంధించిన గత ఆరు నెలల రికార్డులు పరిశీలించగా అక్బర్, అస్గర్, మన్నన్‌ల పేరిట పలు వాహనాలను నిజాబాబాద్‌కు తరలించినట్లు తేలింది. పదిహేను రోజుల వ్యవధిలోనే అక్బర్‌కు పలు వాహనాలు అప్పగించినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరికొందరు నిందితులు అబూద్, యాసర్‌ అరాఫత్‌ అలియాస్‌ అప్పూ, అబ్దుల్లా, ఫరూఖ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అమీనుల్లా, మొహసీన్‌ గ్యాంగుల ద్వారా పలు వాహనాలను తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. మొత్తంగా 77 వాహనాలను స్వాధీనం చేసుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన వాహనాల్లో 41 వాహనాలు ఫైనాన్స్‌ ఎగవేతకు సంబంధించినవి ఉన్నాయి.  

ఖరీదైన వాహనాలే లక్ష్యం 
నిజామాబాద్‌కు చెందిన అక్బర్, అస్గర్‌ సోదరులు ఈ భారీ చోరీ ముఠాను నడిపిస్తున్నట్లు తేలింది. హిందూస్థాన్‌ పార్సిల్‌ సర్వీసెస్‌ మేనేజర్‌ రిజ్వాన్‌ సహకారంతో చోరీ వాహనాలను నిజామాబాద్‌కు తరలించినట్లు వెల్లడైంది. నిజామాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వాహనాల విక్రయాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న డిమాండ్‌ను బట్టి ఫలానా వాహనం పంపాలంటూ వారు సూచించేవారు. ఆ మేరకే మొహసీన్, అమీనుల్లా గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఎన్‌ఫీల్డ్, కేటీఎం వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేసే వారు. రెసిడెన్షియల్‌ కాలనీలు, ఖాళీ ప్రదేశాల్లో తాము గుర్తించిన వాహనాల హ్యాండిల్‌ లాక్‌లను తొలగిస్తారు. అనంతరం ఇగ్నిషన్‌ కేబుల్స్‌ను తొలగించి, డైరెక్ట్‌ కనెక్షన్‌ ద్వారా వాహనాలు స్టార్ట్‌ అయ్యేలా చేసి తీసుకెళ్తారు. ఇలా వాహనాలు చోరీ చేసి తీసుకొచ్చిన వారికి ప్రధాన నిందితులు గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా అక్బర్, అస్గర్‌ గ్యాంగుకు చెందిన వ్యక్తులు ఖరీదైన వాహనాలను ఫైనాన్స్‌ సంస్థల ద్వారా కొనుగోలు చేసి ఉద్దేశపూర్వకంగానే ఫైనాన్స్‌ ఎగ్గొట్టేవారు. అనంతరం ఆ వాహనాలను హిందుస్తాన్‌ పార్సిల్‌ సర్వీసెస్‌ ద్వారా నిజామాబాద్‌కు తరలించేవారు. అక్కడ వీటికి సంబంధించి పత్రాలు సృష్టించి విక్రయించేస్తున్నారు.  

నార్త్‌జోన్‌ పోలీసులకు అభినందనలు 
భారీ వాహనాల చోరీ గుట్టు రట్టు చేసి పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా పనిచేసిన నార్త్‌జోన్‌ పోలీసులను సీపీ అంజనీకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా నార్త్‌జోన్‌ డీసీపీ సూచనలతో కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌ స్వామి ఆధ్వర్యంలో సాగిన పూర్తిస్థాయి దర్యాప్తును ఆయన అభినందించారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన అదనపు ఇన్‌స్పెక్టర్‌లు ఎం. వెంకటేశం, నేతాజీ, జి.నరేశ్, ఎస్‌ఐలు ఎన్‌. సందీప్‌రెడ్డి, ఎస్‌ఎన్‌జీ అవినాశ్‌ బాబు, రవిపాల్, ఎం.మహేశ్, ఏ. మాధవరెడ్డి, కానిస్టేబుల్స్‌ శ్రీధర్, రాజశేఖర్, పురుషోత్తం, రాకేశ్, యాదగిరి, శంకర్‌ నాయక్, హిదయతుల్లాను సీపీ ప్రశంసించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top