చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుత ఏడాదిలో 1, 3 త్రైమాసికాలకు సంబంధించి జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్ష గురువారం నిర్వహించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బానీ బాషా తెలిపారు. ఆయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం 10.30 గంటలకు కలెక్టరేట్లో సమీక్ష ఉంటుందన్నా రు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చ ట్టం అమలు, నమోదైన కేసులు, బాధి తులకు అందించిన పరిహారం, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని కేసుల పురోగతి, చేపట్టిన చర్యల నివేదికలు, సమగ్రమైన డేటాతో హాజరుకావాలని వెల్లడించారు.
అభ్యంతరాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై అధికారులు బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజలు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం 2,912 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 కేంద్రాలను అదనంగా ప్రతిపాదించారు. దీంతో 3,056 చేరాయి. అదనపు కేంద్రాల ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపినట్లు తెలుస్తోంది. కూటమి, వైఎస్సార్ సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు పలు సమస్యలు తెలిపారు. వాటినిఽ అధికారులు నమోదు చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. తదుపరి నివేదికను జెడ్పీ సీఈవోకు పంపించనున్నారు. చివరిగా కలెక్టర్ ఆమోదం పొందాక ఈ నెల 19న తుది జాబితాను ప్రకటించనున్నట్లు జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు వివరించారు.
స్తంభించిన ఈ–వాహన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వాహనాల కొనుగోలు, విక్రయాలు చేసే వారిపై కేంద్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఈ–వాహన్ ఇంటర్నెట్ పోర్టల్లో వాహన యజమాని పేరు మార్పిడి సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. కేంద్ర స్థాయిలో పోర్టల్ సాఫ్ట్వేర్ మార్పులు, నవీకరణ పనులు చేపడుతున్నామంటూ గత నాలుగైదు రోజులుగా ఈ సేవలను రవాణా శాఖ నిలిపివేసింది. ఫలితంగా జిల్లా రవాణా అధికారి కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున పదుల సంఖ్యలో యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు వస్తున్నాయి. ఇంటర్నెట్ పోర్టల్ పనిచేయకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ రెన్యువల్ వంటి ఇతర సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కీలకమైన యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు మాత్రం ముందుకుసాగడం లేదు. సాఫ్ట్వేర్ మార్పులు త్వరలోనే పూర్తవుతాయని, అనంతరం ఈ సేవలు పునరుద్ధరణకు నోచుకుంటాయని జిల్లా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏడీగా పుల్లారెడ్డి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా పుల్లారెడ్డిని నియమించారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖ ఏడీగా పనిచేస్తున్న వినోద్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కలెక్టరేట్లో ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న పుల్లారెడ్డికి విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 4 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.


