2024–25లో రూ.5.29 కోట్లు జమ తర్వాత విడుదల కానీ స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలో సింహభాగం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చిన్న పనులకు కూడా నిధులు లేని పరిస్థితి కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం
చిత్తూరు కార్పొరేషన్: ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది. ఏడాదిగా నిధులు జమ చేయకపోవడంతో స్థానిక సంస్థల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. జెడ్పీకి అద్దెలు, స్టాంప్ డ్యూటీ, మైన్స్ తదితరాల నుంచి ప్రతి ఏటా కొంత ఆదాయం సమకూర్చాలి. ఆ మొత్తంతో జిల్లాలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. దీనికి తోడు వచ్చే ఆదాయంలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం శిశు సంక్షేమ శాఖకు నిధులు వెచ్చిస్తారు. నిధులు రాకపోవడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమశాఖలకు ఇవ్వాల్సిన బడ్జెట్లోనూ కోత పడుతోంది.
వీటి నుంచే ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే తలసరి ఆదాయం రూ.4 ప్రకారం కింద 2020–2026(ఆరేళ్లలో) వరకు జెడ్పీకి రూ.7.39 కోట్లు వచ్చాయి. శాండ్ సీనరేజ్ ఫీజు కింద 2020–26 వరకు రూ.27.75 కోట్లు వసూలైంది. ఇతర ఆదాయాల ద్వారా రూ.62.45 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. ఈ రకమైన పద్దుల నుంచి వచ్చే ఆదాయంతోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పలు రకాల అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉంది.
నిలిచిపోయిన స్టాంప్ డ్యూటీ
స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీ చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న కారణంగానే స్టాంప్ డ్యూటీపై రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకొట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా స్థానిక సంస్థలకు సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ డ్యూటీ విడుదల చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీ పాలకవర్గం స్టాంప్ డ్యూటీపై ప్రత్యేక దృష్టి సారించడంతో రూ.5.29 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక రూపాయి కూడా రాలేదు.
2020–21 రూ.3,14,02,324
2021–22 రూ.9,95,52,209
2022–23 రూ.7,87,45,759
2023–24 రూ.4,30,82,293
2024–25 రూ.5,29,33,404
స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు స్టాంప్ డ్యూటీ. దీనితోనే అభివృద్ధి పనులు చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ పాలక వర్గాలు ఉన్నాయి.
దీంతో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఏడాదిగా స్టాంప్ డ్యూటీని జమ చేయడం లేదు. జిల్లా పరిషత్ స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదాయం లేకపోవడంతో చిన్నచిన్న పనులు కూడా
చేయలేకపోతున్నట్టు పాలకవర్గాల
ప్రతినిధులు వాపోతున్నారు.


