తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు. గురువారం తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవ సన్నాహాలపై సమీక్షించారు. టీటీడీ జేఈఓ శరత్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్లను పంపిణీ చేయాలని కోరారు. విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్రంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు వస్తున్నాయని వెల్లడించారు. టీటీడీ ఇన్చార్జి సీఈ మనోహరం, డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, భాస్కర్, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, డీఎఫ్ఓ ఫణి కుమార్ నాయుడు, ఏఎస్పీ రామకృష్ణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.


