అనంతపురం: అనంతపురం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో బౌలర్ మల్లికార్జున రాణించారు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం, చిత్తూ రు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు.
మల్లికార్జున
వాసుదేవరాజు


