చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం పాలూరు వద్ద ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా టన్నుల కొద్దీ ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. సోమవారం ఈ మేరకు లారీల్లో ఇసుకను చైన్నెకి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తమ పార్టీ శ్రేణులతో కలిసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు.
అడ్డగించిన కార్యకర్తలు
పాలూరు రీచ్ వద్ద ప్రొక్లెయిన్ సహాయంతో రాత్రి వేళ కూడా భారీ వాహనాల్లోకి ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యాల ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ సమయానికే 60 నుంచి 70 టన్నుల లోడుతో రెండు భారీ లారీలు చైన్నెకి తరలిపోగా, మూడో లారీని వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అడ్డంగా పడుకుని నిలిపివేశారు. మమ్మల్ని తొక్కించుకుని వెళ్లండి.. కానీ మన ప్రకృతి సంపదను పక్క రాష్ట్రాలకు దోచిపెట్టనివ్వం అంటూ అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే విజయానందరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకుముందే ఎస్ఐ స్పందించి లారీని స్టేషన్న్కు తరలించినప్పటికీ, ఇసుక తవ్వుతున్న ప్రొక్లెయినర్ను మాత్రం సీజ్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టుబడ్డ లారీ
ప్రొక్లెయినర్
టీడీపీ నేతలకు హెచ్చరిక
విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల దందాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజావసరాలకు వినియోగించాల్సిన ప్రకృతి వనరులను టీడీపీ నేత జయచంద్రనాయుడు అక్రమంగా చైన్నె, కర్ణాటక వాళ్లకు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు దోపిడీని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


