చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్కిల్ కాంపిటిషన్లో యువత పాల్గొ ని తమ నైపుణ్యాలను నిరూపించుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ కోరారు. సోమవారం కలెక్టరేట్లో స్కిల్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండి యా స్కిల్స్ కాంపిటీషన్ను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలోని యువత తమ నైపుణ్యాల ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభిస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, ఇంజి నీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులతో పాటు పరిశ్రమల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యా, శిక్షణా సంస్థలు విస్తృత స్థాయి లో అవగాహన కల్పించి అర్హులైన అభ్యర్థులతో నమోదు చేయించాలని ఆదేశించారు. మెకాట్రానిక్స్, ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, వెల్డింగ్, ఆటోమొబైల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీ థెరపీతోపాటు 63 ప్రధాన విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగలవారు వెంటనే నమోదు చేసుకుని జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


