ఇటుకల తయారీకి అక్రమంగా తలించి డంప్ చేసిన మట్టి
జలాశయంలోనే ఇసుక జల్లిస్తున్న అక్రమార్కులు
కార్వేటినగరం: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో సుమారు 6,700 ఎకరాలకు సాగునీరు అందించే కృష్ణాపురం జలాశయం ఇప్పుడు టీడీపీ నేతకు ఆదాయ వనరుగా మారింది. గతంలో అన్నదాతలకు అండగా నిలిచిన జలాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక, మట్టి దోపిడీకి అడ్డాగా మార్చేశారు. అధికార బలంతో దందా సాగిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు.
పగలు తోడేస్తూ.. రాత్రి తరలిస్తూ..
జలాశయానికి రెండు వైపులా అటవీ ప్రాంతం ఉండటంతో టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. వేల ట్రక్కుల ఇసుక, మట్టిని తోడేసి, సమీపంలో డంప్ చేసుకుంటున్నారు. చీకటి పడగానే టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటించి తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. జలాశయం మట్టిని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇటుక బట్టీలను కూడా ఏర్పాటు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. కళ్లెదుట దోపిడీ సాగుతున్నప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మమూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమార్కులకు పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే అక్రమార్కులకు సమాచారం అందించేస్తున్నారని, తర్వాత తమకు బెదిరింపులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.


