చిత్తూరు కలెక్టరేట్ : పీఆర్సీ ఎక్కడ? ఐదు డీఏలు ఏమయ్యాయి అంటూ ఫ్యాఫ్టో నేతలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) నేతలు మంగళవారం ర్యాలీ, పికెటింగ్, ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుల సుదీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు నరోత్తం రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వందలాది మంది ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ధరల పెరుగుదలకు అనుగుణంగా టీచర్ల ఆర్థిక భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. జూలై 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని కోరారు. ఉపాధ్యాయులకు కనీసం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉండిపోయిన 5 కరువు భత్యం జీఓలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలను వెంటనే జమ చేయాలని స్పష్టం చేశారు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ పెండింగ్లో ఉన్న ఉద్యోగోన్నతుల ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నాని కోరారు. అర్హులైన వారికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
సంపూర్ణంగా మద్దతిస్తాం
జిల్లా జేఏసీ చైర్మన్ కేవీ రాఘవులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి జేఏసీ తరఫున సంపూర్ణంగా మద్దతిస్తామని ప్రకటించారు. అనంతరం ఫ్యాప్టో జిల్లా కమిటీ ప్రతినిధులు డీఆర్ఓ మోహన్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో కో–చైర్మన్లు రామమూర్తి, అరుణ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్ఆర్ మదన్ మోహన్ రెడ్డి, చలపతిరావు, పీహెచ్ జగదీష్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డెప్ప నాయుడు, సురేష్, గిరి యాదవ్, ఇలియాస్ బాషా, ముక్తార్ అహ్మద్, దీనావతి, యువరాజు, రహనా బేగం, దేవరాజులు, ఎస్పీ బాషా, ఏకాంబరం, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


