చిత్తూరు కలెక్టరేట్ : మంత్రుల హామీతో ఉద్యోగుల సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ హుస్సేన్, కో–చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్ల న్యాయపరమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యల పరిష్కారం పై రాష్ట్ర మంత్రిమండలి కమిటీ ఇచ్చిన హామీ మేరకు ఈనెల 21న శ్రీకాకుళంలో నిర్వహించ తలపెట్టిన ‘ఉద్యోగుల సన్నద్ధ సభ’ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమావేశంలో మంత్రుల కమిటీకి 23 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశామని వివరించారు. 21న జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వచ్చే సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని, ఆ తర్వాతే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఆర్టీసీ విభాగం జిల్లా చైర్మన్ పి. మురుగేష్, మున్సిపల్ వర్కర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు గంజి రామమూర్తి, అగ్నిమాపక, ప్రభుత్వ డ్రైవర్ల సంఘాల జిల్లా అధ్యక్షులు జి.నరేష్, శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శరవణతో పాటు జిల్లా యూనిట్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.


