– జిల్లాలో 19న చెస్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 19న నిర్వహించే చెస్ పోటీల్లో అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఆర్.బి.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని టీటీడీ కల్యాణ మండపంలో చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు రూ.1,07,000 నగదు పురస్కారం అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో తొలిసారిగా చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆల్ చిత్తూరు జిల్లా చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ చెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులను మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు, 18 ఏళ్లు పైబడిన పురుషులకు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందే వారికి నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, మెడల్స్ అందజేస్తామన్నారు. తమ పేర్లను జూలై 18న 9849313676, 9000475799, 8019424467 నంబర్లలో నమోదు చేసుకోవాలని చెప్పారు. జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ పి.బాబూప్రసాద్, స్కూల్ఆఫ్ చెస్ చైర్మన్ ఎస్.ఆర్.దినేష్, అడ్వకేట్ సునీల్, మధు, నాగసంతోష్, కుమార్ పాల్గొన్నారు.


