పలమనేరు:పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని టీఎస్ అగ్రహారానికి చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి ఇటీవల ఆర్ఎస్కే లో బస్తా వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేశాడు. వీటిని వలిస్తే ఎక్కువగా సచ్చులు, పుచ్చులు ఉన్నట్టు గుర్తించాడు. అదేవిధంగా బస్తాలోని 30 కేజీల్లో కిలో రాళ్లు ఉండ డం చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ఇలాంటి నాశిరకం విత్తనాలు రైతులకు చేరినట్టు తెలుస్తోంది.
ఏజెన్సీల నిర్లక్ష్యంతోనే...
ఇక్కడి రైతులకు ఏటా కదిరి–6 రకం విత్తనాలను పంపిణీ చేస్తుంది. ఈ దఫా నిర్వాహకులు నాణ్యమైన విత్తనాలను ఇవ్వలేదని తెలుస్తోంది. వీటిని వ్యవసాయశాఖ అన్ని రకాలుగా పరీశించి ఆపై రైతులకు పంపిణీ చేయాలి. వ్యవసాయశాఖ వాటిని చూసిందా లేదా అన్నది అనుమానంగా మారింది. అందువల్లే కాయల్లో సచ్చులు, పుచ్చులు, రాళ్లు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొదలైన విత్తనకాయల పంపిణీ
ఈదఫా ఖరీఫ్ సీజన్కు పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో వేరుశనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. ఏడు మండలాలకు 5,660 క్వింటాళ్లు వచ్చాయి. బస్తా (30 కేజీలు) పూర్తి ధర రూ.3,060 కాగా 40 శాతం సబ్సిడీ రూ.1,224 పోనూ రైతు రూ.1,836 చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వం పంపిణీ చేసిన కే–6 రకం వేరుశనగ విత్తన కాయలు
పుచ్చిపోయిన విత్తన కాయలు
బస్తాలో తేలిన రాళ్లు
మూటలో కిలో రాళ్లు ఉన్నాయి
నేను 30 కేజీల వేరుశనగ విత్తన కాయలు కొన్నాను. వలుద్దామని చూస్తే సచ్చులు, పుచ్చులు ఉన్నాయి. వీటిని తీసేసి చూస్తే రాళ్లే కిలోకు పైగా ఉన్నాయి. అధికారులు నాణ్యతను చూడకుండా ఎలా కొనుగోలు చేశారో వారికే తెలియాలి. ఏదో ఆలస్యంగానైనా ఇచ్చారని తీసుకున్నాం.
– రెడ్డెప్పరెడ్డి, రైతు, టీఎస్ అగ్రహారం, పలమనేరు మున్సిపాలిటీ


