ఎక్కడి సమస్యలు అక్కడే
ఉద్యమించాల్సిన సమయం
ఆసన్నమైంది
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ బరిలో గంటామోహన్
పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం
ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా అయ్యోర్లకు ఒరిగిందేమి లేదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధ్యాయుల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని, హక్కుల సాధనకు ఉపాధ్యాయ లోకం మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇంతవరకు 12వ పీఆర్సీకి కనీసం చైర్పర్సన్ను కూడా నియమించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ నియమించి, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 5 డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు చేస్తూ, అర్హులైన ఉపాధ్యాయులందరికీ తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష లేకుండా, పార్లమెంటులో విద్యాహక్కు చట్టానికి అవసరమైన సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై కూటమి సర్కారు ఒత్తిడి తీసుకురావాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా, ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేసేందుకు ఈనెల 14వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వ హించే కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంటా మోహన్ పేరు ప్రతిపాదిస్తూ తీర్మానం
ఎస్టీయూ జిల్ల అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఉద్యమ నాయకుడు గంటా మోహన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇన్చార్జ్గా నియమించినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో జరగబోయే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఆయనను అధికారిక అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి, రాష్ట్ర సంఘానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశమలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఇలియాజ్, ఆర్థిక కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవరాజులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యువరాజు, సంఘ నాయకులు హేమచంద్రారెడ్డి, రమణారెడ్డి, బొబ్బిలి రెడ్డి, గిరిబాబు, నాగభూషణం, నాగేంద్ర రాజు, ఢిల్లీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం


