టమాటా రైతులు కష్టాల కన్నీళ్లు!
పలమనేరు డివిజన్లో సాగు వివరాలు
ధరల్లేక రోడ్డుపక్కన పడేసిన టమాటాలు
పలమనేరు: సాధరణంగా సాగయ్యే టమాటా కంటే ఈదఫా ఎక్కువగా పంట సాగైంది. సాంప్రదా య రైతులే కాదు సాప్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, వైద్యు లు సైతం భారీగా టమాటా సాగులోకి దిగారు. అందు లో భారీ పెట్టుబడులతో ఎక్కువ పలసాయాన్ని ఇచ్చే పలు రకాల హైబ్రిడ్ రకాలను సాగు చేశారు. దీంతో ఎకరానికి 1700 బాక్సుల నుంచి 2వేల బాక్సులకు పంట దిగుబడులు పెరిగాయి. మార్కెట్లను టమాటా ముంచెత్తుతోంది. దీంతో ధరలు తగ్గు ముఖం పట్టా యని వ్యాపారులు చెబుతున్నారు. రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్శాఖ టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తోంది. అయితే మొక్కుబడిగా ఓ లోడు కొంటూ రైతు లు ఆదుకున్నామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప నిజంగా టమాటా రైతులపై కూటమి ప్రభు త్వం నుంచి ఎలాంటి సాయం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయటి రాష్ట్రాల నుంచి డిమాండ్ లేదు
బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు రావడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ మొదలైంది. దీంతో అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. దీంతో అక్కడి వ్యాపారులకు ఇక్కడికి రావడం లేదు. ఇక అనంతపూరం జిల్లానుంచి ఎక్కువగా టమాటాలు పలు మార్కెట్లకు చేరుతున్నాయి. దీంతో ఉన్న సరుకును అమ్ముకోవాలని రైతులు మాగిన కాయలను వెంటవెంటనే కోసి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ తగ్గింది. ఆయా రాష్ట్రాల్లోనే కావాల్సినంత సరుకు అందుబాటులో ఉంది. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది.
రైతులను ఇలాగేనా ఆదుకొనేది?
రాష్ట్రంలోని టమాటా రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులనుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ టమాటాలను కొంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆమేరకు పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ కేవలం పది టన్నుల టమాటాలను కొని రైతు బజార్లకు అమ్మేందుకు తీసుకెళ్లింది. దీంతో టమాటా రైతుల కష్టాలు తీరుతాయా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతులకు మరెన్నో మోసాలు
అసలే ధరల్లేక ఇబ్బందులు పడి టమాటాలను మార్కెట్కు తీసుకొచ్చే రైతులకు మండీ వ్యాపారు లు 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. నిబంధనల మేరకు 4శాతమే వసూలు చేయాలి. ఇదిగాక దింపుడు కూలీలని, క్రేట్ అద్దెలంటూ వసూళ్లు తప్పడంలేదు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులకు మాత్రం కష్టాలు తప్పడంలేదు.
జిల్లాలోని పడమటి మండలాల రైతులకు ఏటా టమాటానే ప్రధాన పంట. ఈ దఫా ఇప్పటికే టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. పలమనేరు మార్కెట్లో శుక్రవారం 15కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 కాగా సగటు ధర రూ.100 మాత్రమే పలికింది. దీంతో భారీ పెట్టుబడులు పెట్టి టమాటా సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితుల్లో ఆశలు అడియాశలయ్యాయి.
ఖరీఫ్ టమాటా సాధరణ సాగు
6వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట 5వేల హెక్టార్లు
ఇప్పుడు కోత దశలో ఉన్న తోటలు
3వేల హెక్టార్లు
మరో 15 రోజుల్లో కోతలకు
సిద్ధమయ్యే తోటలు 2వేల హెక్టార్లు
పలమనేరు మార్కెట్కు వస్తున్న
స్థానిక సరుకు రోజుకు 35 టన్నులు


