విజయపురం (నగరి): విజయపురం మండలంలోని పన్నూరు గ్రామంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఒక మహిళపై దాడి చేసి ఆమె మెడలోని రూ.4 లక్షలు విలువచేసే బంగారు తాళిబొట్టు చైన్ను అపహరించిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితురాలు కామాక్షి, ఆమె భర్త వెంకటేశులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వారి ఇంటి వద్దకు వచ్చారు. తమ బైక్కు సమస్య వచ్చిందని, స్పానర్ కావాలని అడిగారు. కామాక్షి స్పానర్ తీసుకువచ్చి ఇవ్వబోతుండగా, దుండగులు తమ చేతిలో ఉన్న హెల్మెట్తో ఆమైపె దాడి చేశారు. దాడితో ఆమె తేరుకునేలోపే మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు చైను లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేయగా అప్పటికే దుండగులు అక్కడి నుంచి వేగంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాధితులు విజయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఓపీఎస్ అమలుపై పోలీసుల హర్షం
చిత్తూరు అర్బన్: పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ డూడీను కలిసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్లు, ఆయన్ను సన్మానించారు. 2003 నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన తమకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఆధారంగా ఓపీఎస్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.


