వర్తింపజేయని 62 ఏళ్ల ఉద్యోగ విమరణ ఉత్తర్వులు నష్టపోతున్న 240 మంది ఉద్యోగులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విన్నవించినా రాని హామీ
రెస్కో ఉద్యోగులకు
కుప్పం రూరల్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచు తూ ప్రభుత్వం ఇటీవల జీవో ఎంఎస్ నంబర్ 45 ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కో ఆపరేటివ్ సొసైటీలకు ఈ జీవో వర్తిస్తుందని ప్రకటించింది. కుప్పం రెస్కోకు మాత్రం వర్తించదని అధికారులు పేర్కొనడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమకు కూడా ఆ ఉత్తర్వులు వర్తింపజేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు నిరాశచెందుతున్నారు.
గ్రామీణ ప్రాంతమైన కుప్పంలో నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో 1983లో రెస్కో (కుప్పం గ్రామీణ విద్యుత్ సహకారం సంస్థ కోఆపరేటివ్ లిమిటెడ్)ను అప్పటి ప్రభుత్వం స్థాపించింది. ఇందులో సుమారు 240 మంది విధులు నిర్వహిస్తున్నారు. జూలై నెల మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లు చేస్తూ జీవో ఎంఎస్ నంబర్ 45ను తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కో ఆపరేటివ్ సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది. రెస్కో మాతృ సంస్థలైన ట్రాన్స్ కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కుప్పం రెస్కో ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. రెస్కో సంస్థ 9,10 షెడ్యూళ్లలో ఈ అంశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో 240 మంది ఉద్యోగులకు 62 ఏళ్ల ఉద్యోగ విరమణ హక్కును పొందలేకపోతున్నారు. మొదట్లో పెంచిన 60 ఏళ్లు విరమణను వర్తింపజేయకపోగా, ఇప్పుడు 62 ఏళ్ల విరమణ ఉత్తర్వులను వర్తింపజేయకపోవడంతో ఉద్యోగులు 58 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది.
సీఎం, మంత్రికి విన్నవించినా లేని హామీ
62 ఏళ్ల ఉద్యోగ విరమణను తమకూ వర్తింపజేయాలని కొంతమంది ఉద్యోగులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విన్నవించారు. వారి నుంచి సరైన హామీ అందకపోవడంతో ఉద్యోగులు రాష్ట్ర మంత్రులను స్వయంగా కలవాలనే ఆలోచనకు వచ్చారు. ఏది ఏమైనప్పటికీ సీఎం సొంత నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక నిబంధన, రాష్ట్ర మొత్తం ఉద్యోగులకు ఒక నిబంధనగా తయారైంది రెస్కో పరిస్థితి.
నష్టపోతున్న 280 మంది ఉద్యోగులు
మొదటి విడతగా ప్రభుత్వం 58 నుంచి 60 ఏళ్ల ఉద్యోగ విరమణ వయస్సును పెంచిన సమయంలో రెస్కో ఉద్యోగులకు వర్తించక నష్టపోయారు. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లి రెండేళ్ల ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ అలవెన్సులు ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం 62 ఏళ్ల ఉద్యోగ విరమణ నిబంధన వర్తించదని చెబుతున్నారు. దీంతో 280 మంది ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. రెస్కోలో 62 ఏళ్ల జీవో అమలులోకి వస్తే తాజాగా ఉద్యోగ విరమణ చేసిన వారు 15 మంది విధుల్లోకి చేరాల్సి ఉంది. ఈ జీవో వర్తించకపోవడంతో 15 మంది నష్టపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మంతా ఉద్యోగులకు ఒక రూలు మాకు మరో రూలా అంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. రెస్కో ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే రెస్కో సంస్థ 9, 10 షెడ్యూళ్లల్లో ఈ విషయం లేదని, మీరు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు వాపోతున్నారు.


