చిత్తూరు కార్పొరేషన్: జనాభా, ఆదాయ వనరులు, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని గ్రామ పంచాయతీలను రూర్బన్, గ్రేడ్– 1, 2, 3గా విభజించారు. ఈ మేర కు పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 621 గ్రామ పంచాయతీలు ఉండగా రూర్బన్ కింద కాణిపాకం, వి.కోట, గంగవరం, కార్వేటినగరం వస్తాయి. 10 వేల జనాభా, రూ.కోటి ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను 04 రూర్బన్ గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే 3 వేల నుంచి 10 వేల లోపు జనాభా, రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం 100 గ్రామ పంచాయతీలను గ్రేడ్–1గా, 2 వేల నుంచి 3 వేల జనాభా ఉన్న 140 గ్రామ పంచాయతీలను గ్రేడ్–2గా, 2 వేల లోపు జనాభా ఉన్న 377 గ్రామ పంచాయతీలను గ్రేడ్–3గా పునర్విభజన చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ క్లస్టర్ల స్థానంలో ప్రభుత్వం తాజాగా రూర్బన్, గ్రేడ్ల వారీగా విభజించింది.
ఉద్యోగుల సర్దుబాటు
జిల్లాలోని 621 గ్రామ పంచాయతీలకు సంబంధించి పలు పంచాయతీల్లో గ్రేడ్లకు అనుగుణంగా కార్యదర్శులు విధులు నిర్వహించడం లేదు. పరిపాలనా సౌలభ్యం, ఇతర కారణాల వల్ల తక్కువ గ్రేడ్ ఉన్న కార్యదర్శి ఎక్కువ గ్రేడ్ ఉన్న పంచాయతీలో పనిచే స్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్ల వారిగానే కార్యదర్శులు పనిచేయాలని పీఆర్అండ్ఆర్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శులను సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ మొదలైతే పలువురికి స్థానచలనం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూర్బన్ గ్రామ పంచాయతీలకు తప్పనిసరిగా డిప్యూటీ ఎంపీడీఓ లేదా గ్రేడ్–1 కార్యదర్శిని నియమించాలి.


