చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కమిషనర్ పేరిట కొందరు సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించాలని ఫోన్లు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. ఓ వ్యక్తి తాను మునిసిపల్ కమిషనర్గా పరిచయం చేసుకుని, ఆస్తి పన్ను చెల్లించాలని క్యూర్ కోడ్ పంపాడు. దీన్ని రికార్డు చేసిన వ్యక్తి మునిసిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కమిషనర్ స్పందిస్తూ పన్ను చెల్లింపుదారులు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్సుల పన్నులు చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలు చెప్పి ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ పంపి డబ్బులు చెల్లించాలని మోసం చేస్తున్నారని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పన్ను చెల్లించాలని కమిషనర్, ఇతర అధికారులు ఎవరికీ నేరుగా ఫోన్ చేయరని, ఫోన్ పే, స్కానర్కు డబ్బులు పంపాలని చెప్పే అవకాశం లేదన్నారు. నగరపాలక పరిధిలో పలువురు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఫోన్ పే ద్వారా పన్నులు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. 9440219722 నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.


