చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పొగాకు ఉత్పత్తులను పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాలతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ రామచంద్ర సిబ్బందితో కలిసి నగరంలో దాడుల నిర్వహించారు. పొన్నియమ్మ గుడివీధి, కాయనికట్టు వీధి, చర్చి వీధి, స్వామి రెడ్డి వీధి ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 57 బస్తాల్లో నిల్వ ఉంచిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన చంపాలాల్, రవీంద్రబాబు, అబ్దుల్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నగరంలో గుట్కా రాకెట్ వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నాడని .. అతనితో పొసగని అదే పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని పోలీసులకు ఉప్పందించినట్లు సమాచారం.
ఎరువుల దుకాణాలు బంద్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా అగ్రి ఇన్పుట్స్ అసోసియేషన్ బంద్కు దిగింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని అగ్రి ఇన్న్పుట్ షాపులు కూడా దానికి మద్దతు ప్రకటించాయి. స్వచ్ఛందంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులకు తాళం వేశాయి.


