పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
– 90 శాతం రెవెన్యూ సమస్యలే
గంగాధర నెల్లూరు: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని గడువు లోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జీడీ నెల్లూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వందలాది తరలివచ్చి అర్జీలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అర్జీలు స్వీకరించారు. మొత్తం 257 వినతలు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ 117, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 50, పోలీస్ 46, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 13, రూరల్ వాటర్ సప్లై ఇంజినీరింగ్ 6, అగ్రికల్చర్ 6, పంచాయత్రాజ్ 6, విద్యుత్శాఖ 2, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2, వాటర్ రిసోర్స్ 2, ఎండోమెంట్ 1, లీగల్ మెట్రాలజీ 1, రోడ్లు, బిల్డింగ్స్ 1, పబ్లిక్ హెల్త్ 1, అనిమల్ హస్బెండ్రీ 1, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, గనులు, భూగర్భశాఖ 1 వచ్చినట్టు తెలిపా రు. ఇందులో 90 శాతం అర్జీలు రెవెన్యూకు సంబంధించినవేనని తెలిపారు. గడువులోగా అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. జీడీనెల్లూ రు ఎమ్మెల్యే థామస్, జాయింట్ కలెక్టర్ ఏ.రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్కుమార్, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోక్సోకేసులో నిందితుడి అరెస్ట్
వెదురుకుప్పం: పోక్సో కేసులో నిందితుడ్ని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీటీసీ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లా, భాకరాపేట మండలంలోని రామమూర్తి కుమారుడు చందు(26)పై ఇటీవల వెదురుకుప్పం పోలీస్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కాగా సోమవారం మండలంలోని పచ్చికాపల్లంలో నిందుతుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.


