చిత్తూరు కలెక్టరేట్ : సామాజిక విప్లవకారుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. జిల్లా కేంద్రమైని చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గంగినేనిచెరువు వద్ద ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంగినేనిచెరువు నుంచి అంబేడ్కర్ భవనం వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ ఒక నాయకుడు మాత్రమే కాదని, కోట్లాది మంది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన హయాంలో తీసుకువచ్చిన పలు చట్టాలు నేటికీ బహుజనుల రక్షణకు కవచాల్లా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. నేటి యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి
సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కలెక్టర్ వాపోయారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు అందేలా చేయాలని కోరారు. చట్టాలను అక్షరాలా అమలు చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు చేరువలో విద్య, వైద్యం, తాగునీరు, హాస్టల్ సదుపాయాలను మెరుగుపరచడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, చుడా చైర్మన్ కఠారి హేమలత, ఆర్డీవో శ్రీనివాసులు, మాజీ మేయర్ అముద, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


