తవణంపల్లె : మండలంలోని దిగువ మోదలపల్లె కొత్త చెరువులో బ్లేడుతో గొంతుకోసి యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆయన ఆదివారం తవణంపల్లె పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని దిగువ మోదలపల్లె హెచ్డబ్ల్యూకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు యువరాజ్(18) అదే గ్రామంలోని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రేవతి కుమారుడు లవకుమార్(23) ఆ అమ్మాయితో ఫొటో తీసుకుని ఇన్స్ట్రాగాం, ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీనిపై యువరాజ్ అభ్యంతరం తెలిపారు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని, ఫొటోలు తీయొద్దని లవకుమార్ను హెచ్చరించాడు. అతను వినకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు కూలి పనులకు వచ్చే బాలుడి సహాయంతో పథకం ప్రకారం లవకుమార్ను దిగువ మోదలపల్లె కొత్తచెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతనితో మద్యం తాగించాడు. మత్తులో ఉన్న సమయంలో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువు నీటి గంటలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి తల్లి రేవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యువరాజ్, అతనికి సహకరించిన బాలుడు ఆదివారం తెల్లగుండ్లపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉండగా అరెస్టు చేశారు. బాలుడిని జ్యువైనల్ హోమ్కు తరలించారు. హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్నాయుడు, కాణిపాకం, యాదమరి ఎస్ఐలు టి.నరసింహులు, డి.ఈశ్వరయ్యను అభినందించారు.


