చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులకు ఈ నెల 7 నాటికి బిల్లులు ఇప్పించేలా చూస్తామని, లేకుంటే తాను తమతోపాటే నడుస్తానని చిత్తూరు రూరల్ తహసీల్దార్ కల్యాణి హామీ ఇచ్చారు. బిల్లుల కోసం రైతులు చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని పండ్ల గుజ్జు ఫ్యాక్టరీ వద్ద దీక్ష చేపట్టారు. దీనిపై గుంజుకొని డబ్బులు ఎగ్గొట్టారు అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో థనం ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ తహసీల్దార్ కల్యాణి దీక్షా శిబిరానికి చేరుకుని రైతులతో చర్చించారు. బిల్లులు చెల్లింపునకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు కావాలని ఫ్యాక్టరీ ఎండీ కోరారని పేర్కొన్నారు. ఈ మేరకు వారు లెటర్ ఇచ్చారని తెలిపారు. 7వ తేదీ నాటికి మొత్తం బకాయిలు ఇప్పిస్తామని తెలిపారు. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పుడు కూడా బిల్లులు చెల్లించకపోతే పూచి ఎవరని రైతుల ప్రశ్నించారు. అందుకు తహసీల్దార్ మాట్లాడుతూ తాను ప్రభుత్వం తరఫున వచ్చానని, ఇవ్వకుంటే తాను కూడా మీతో ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


