చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుష్టువ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో కలిసి చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునీకరించిన లెప్రసి వార్డును ప్రారంభించారు. వార్డులో ఏర్పాటుచేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కుష్టువ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించి పూర్తిస్థాయిలో సాధారణ వ్యక్తులుగా మార్చాలన్నారు. ఫిజియోథెరపీ యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పాదరక్షలు, దుస్తులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, అరుణ, రమేష్, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, ఎం.ఎస్ ఉషశ్రీ, ఆర్ఎంవో సంధ్య, టీహెచ్ లెప్రసి వార్డు మెడికల్ అధికారి జానకిరావు, జిల్లా లెప్రసి ఎయిడ్స్ అండ్ క్షయ నివారణ అధికారి జి వెంకటప్రసాద్, అపోలో అధికారులు పాల్గొన్నారు.


