చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉద్ధృతం చేయనున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ తెలిపారు. యూటీఎఫ్ నాయకులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరాహర దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. వెంటనే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ బకాయిలను విడుదల చేయాలన్నారు. సీపీఆర్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. నిరాహార దీక్షకు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాఘవులు మద్దతు ప్రకటించారు. నిరహార దీక్షలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్, రాష్ట్ర కౌన్సిలర్ సోమశేఖర్నాయుడు, ఎస్పీ బాషా, జిల్లా గౌరవాధ్యక్షులు సదాశివరెడ్డి పాల్గొన్నారు.


