చిత్తూరు కార్పొరేషన్: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్లగా సుస్మిత, నాగార్జునను నియమించారు. బంగారుపాళ్యం కుర్మాయిపల్లెకు చెందిన నాగార్జున కడప సీఐఎస్ఎఫ్ ఎస్ఐగా ఉత్తరాఖండ్లో 2018–2026 వరకు విధులు నిర్వహించారు. తదుపరి ఉన్నత పరీక్షలు రాసి వైఎస్ఆర్ జిల్లా ఏటీడబ్ల్యూగా బాధ్యతలు చేపట్టారు. గ్రూప్స్–2లో ఎంపికై చిత్తూరు జిల్లాకు కేటాయించబడ్డా. సంవత్సరం పాటు ట్రైనీ సబ్ రిజిస్ట్రార్గా నగరంలో పనిచేయనున్నారు. ఆయనకు నియమాకపత్రాలను జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి మంగళవారం అందజేశారు.
నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు
పులిచెర్ల(కల్లూరు): నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వివిధ కోర్టుల్లో ష్యూరిటీగా వినియోగిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంపీడీఓ పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ సీళ్లు తయారు చేసి, వాటితో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా తిరుపతి, పా కాల, పుంగనూరు, పీలేరు, చిత్తూరు కోర్టుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు ష్యూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సీళ్లు, రబ్బరు స్టాంపులు, ఇంక్ప్యాడ్, వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నారు. పులిచెర్ల 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన డి.ఆంజనేయులు, సి.రవి, చిన్నగొట్టిగల్లుకు చెందిన నీలం వెంకటరమణ, తిరుపతికి చెందిన పి.బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కుప్పం రూరల్: చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండ లం మోట్లచేను గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మృతి చెంది... మంగళ వారం బయటపడ్డ సంఘటన వివరాలు స్థానికుల కథనం మేరకు ఇలా ఉంది. మోట్లచేను గ్రామానికి చెందిన భూపతి(38)కి, భార్య మధ్యన తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా ఇరువురు గొడవలు పడ్డారు. ఆదివారం తరువాత భూపతి కనిపించకుండా పోయాడు. తీరా మంగళవారం గ్రామం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసు కుని వేలాడుతున్న భూపతి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భూపతి మృతి చెందిన తీరు... సంఘటనలో ఆనవాళ్లను బట్టి స్థానికు లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ అధికారులపై దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఏసీబీ అధికారులపై దాడి చేసినందుకు సనంగి రామకృష్ణ, సనంగి సతీష్ అనే అన్నదమ్ములపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ సీఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు.. చిత్తూరులోని స్టాంపులు–రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో బయట రైటర్లు ఉన్న పలు దు కాణాల్లో తనిఖీలు చేశారు. ఏసీబీ కానిస్టేబుళ్లు ధనుంజయ్, లీలాప్రసాద్ తనిఖీలు చేస్తున్న సమయంలో వెలుపల ఉన్న రైటర్స్ దుకాణంలో ఉన్న రామకృష్ణ, సతీష్ వాదనకు దిగారు. ఆపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేశారు. దీంతో ఏసీబీ సీఐ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
‘గాలేరు– నగరి’ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్
తిరుపతి అర్బన్: గాలేరు–నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి పూల మొక్కను అందజేశారు.
పాఠశాలకు మౌలిక వసతులు
గుడిపాల: పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. మంగళవారం నరహరిపేట జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలోని బిల్డింగ్లకు పెయింటింగ్, విద్యార్థులకు డెస్క్లు, పాఠశాల పైకప్పుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను తెలియజేస్తేపరిష్కరిస్తామన్నారు.
ప్రకృతి సేద్యంతో అధిక ఆదాయం
తవణంపల్లె: ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం వస్తుందని జిల్లా రీసోర్స్ సెంటర్ అధికారి లక్ష్మీప్రసన్న తెలిపారు. మంగళవారం మండలంలోని చెర్లోపల్లెలో పీఎం ఆర్కేవీవై(ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) పథకం కింద రైతులకు వ్యవసాయ సాంకేతికత, సమగ్ర పోషక నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈఓ కుసుమ, ఏఓ వందన, రైతులు పాల్గొన్నారు.


