వెదురుకుప్పం : దళితులపై చిన్నచూపుతో అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్న టీడీపీలో ఇమడలేకున్నాం...కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా దళితుల సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా పావుగా వాడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగి న బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కొత్తపల్లె శంకర్ ప్రకటించారు. ఈమేరకు శనివారం వెదురుకుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను విడగొట్టి బలిపశువులు చేసినట్లు ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాల కూటమి పాలనలో దళితుల సంక్షేమం కోసం వారి అబివృద్ధి కోసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్టకపోవ డం దారుణమన్నారు. సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో వాటిని ఏ ఎస్సీ కాలనీలో ఖర్చు చేశారో తెలియదన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను భర్తీ చేయ కపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వివక్షకు నిదర్శనమన్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు దళితుల కు న్యాయం చేస్తారని భావించి కష్టపడి పనిచేసినట్లు గుర్తు చేశారు. అయితే దళితుల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు దళితులందరూ ఏకమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీలను ఎంతో హేళనగా చూస్తూ ఎన్నో అవమా నాలకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అందరూ ఏకమవుతున్నట్లు చెప్పారు. టీడీపీలో ఉన్న దళితులందరూ ఎందుకు ఓటేశామా అంటూ వ్యతిరేక భావాలను వ్యక్త పరుస్తున్నట్లు చెప్పారు. దళిత వ్యతిరేక ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎస్సీల సంక్షేమాన్ని కోరే, అంబేడ్కర్ ఆశయ సాధ న కోసం నడిచేవాళ్లందరూ కూటమి ప్రభుత్వాన్ని వీడనున్నట్లు చెప్పారు.


