– తనిఖీలు చేపట్టిన పోలీసులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ మంగళవారం మరోమారు బెదిరింపులు వచ్చాయి. దీంతో సుమారు 5 గంటలకు పైగా తనిఖీలు చేసిన పోలీసులు.. అది ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు భవనాల్లో బాంబులు పెట్టామని.. మధ్యాహ్నం 2 గంటలకు అవి పేలనున్నాయంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ–మెయిల్స్ అధికారులను పరుగులు పెట్టించాయి. ఉదయం 11.57 గంటలకు ఓ నకిలీ అడ్రస్ నుంచి జిల్లా జడ్జి అధికారి మెయిల్ ఖాతాకు ఓ సందేశం వచ్చింది. తమిళనాడులోని ఓ వ్యక్తి తన మనవరాలిపై లైంగికదాడి చేశాడని, కేసు నమోదు కాకుండా అక్కడి అధికార పార్టీ నేత అడ్డుకుంటున్నాడని, దీనికి నిరసనగానే చిత్తూరు కోర్టులో 14 సైనెడ్ బాంబులు పెట్టామని మెయిల్లో పేర్కొన్నారు.మెయిల్ ఓపెన్చేసి చూసిన న్యాయశాఖ సిబ్బంది .. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ సీఐ మహేశ్వర, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తమ సిబ్బందితో కోర్టుకు చేరుకుని భవనాలు ఖాళీ చేయించారు. జిల్లా జడ్జి అరుణసారికతో మెయిల్పై చర్చించారు. తర్వాత బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గతంలో సైతం ఇదే విధంగా బాంబు బెదిరంపులు రావడం గమనార్హం. తాజా ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


