బ్యాడ్మింటన్ చాంపియన్స్
నగరి : బాల్యం నుంచే ప్రతి ఒక్కరిలో ఏదో రంగంపై ఆసక్తి ఉంటుంది. దానిని సరైన సమయంలో గుర్తించి మంచి శిక్షణ ఇస్తే వారు ఏ గ్రామంలో జన్మించినా జాతీయ స్థాయికి ఎదుగుతారనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఇదే చేసి చూపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ప్రాథమిక స్థాయి నుంచి బాల్ బ్యాడ్మింటన్పై ఉన్న ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయులు వారిని సానబెట్టారు. ఫలితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చక్కని ఆటతీరును ప్రదర్శిస్తూ పతకాలు దక్కించుకుంటున్నారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చేపడుతున్న ప్రత్యేక చర్యల ద్వారా ఉమ్మడి జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడ పుంజుకుంటోంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1వ తేది వరకు ఈరోడ్ ఎక్స్ఎల్ కళాశాల మైదానంలో 70వ జాతీయ స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు చిత్తూరు జిల్లా నగరి నుంచి కేసీ తేజేష్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి తరుణ్ అనే విద్యార్థులు ఎంపికకావడం విశేషం. వీరంతా సామాన్య, మధ్య తరగతికి చెందిన వారే కావడం విశేషం. ఒక వైపు చదువుకుంటూ మరోవైపు ఆటల్లో రాణిస్తున్నారు.
గ్రామీణ క్రీడాకారులు చదువు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఆటల్లో సత్తా చాటుతున్నారు. గాయాలకు భయపడకుండా క్రీడల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో సత్తా చాటుతున్నా రు. పతకాలు సాధిస్తున్నారు. ఇండియా జట్టు ఎంపిక పోటీల్లోనూ పాల్గొంటూ శభాష్ అనిపించుకుంటున్నారు.
స్టార్ ఆఫ్ ఆంధ్ర
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం, అక్కగారిపేటకు చెందిన ప్రశాంతి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బీపీ అగ్రహారంలోని ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. బాల్ బ్యాడ్మింటన్పై మక్కువతో చిన్నతనం నుంచి శిక్షణ పొందింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పలుమార్లు పతకాలు సాధించింది. 2023లో జాతీయ స్థాయి పోటీలో పాల్గొనింది. అంతర్ జిల్లాల సబ్జూనియర్స్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరచి స్టార్ ఆఫ్ ఆంధ్ర అవార్డును సాధించింది. 2024 జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ప్రతిభ చాటింది.
స్టార్ ఆఫ్ ఇండియా
నగరికి చెందిన తేజేష్.. ప్రస్తుతం నగరి పట్టణంలోని శ్రీసాయి వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పీటీ మాస్టర్ గోపి సహకారంతో బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. 2023, 2024లో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కీలకపాత్ర వహించాడు. 2024లో స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నాడు. ఈ నెల 28 నుంచి ఈరోడ్లో జరిగే జాతీయస్థాయి జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొననున్నాడు.
సత్తాచాటుతున్న హేమ్చరణ్
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్కు చెందిన హేమ్ చరణ్ మూడేళ్లుగా బాల్ బ్యాడ్మింటన్లో తర్పీదు పొందుతున్నాడు. అండర్ 14 విభాగంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన హేమ్చరణ్ గత ఏడాది అండర్ 14లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనభరచి పతకాలు సాధించాడు. 2024లో అంతర్జిల్లాల పోటీలో ప్రతిభ కనభరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొని జట్టును విజయపథంలో నిలిపాడు.
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్
నగరి మండలానికి చెందిన లక్ష్మీనరసింహారెడ్డికి బాల్బ్యాడ్మింటన్ అంటే మక్కువ. గత నాలుగేళ్లుగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నాడు. 2023, 2024, 2025లో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 14 క్రీడల్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. 2023లోనే నేషనల్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. 2025లో జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నా డు. బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన అంతర్జిల్లాల పోటీలో ప్రతిభ కనభరచి బెస్ట్ అప్కమింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.
బ్యాడ్మింటన్ చాంపియన్స్
బ్యాడ్మింటన్ చాంపియన్స్
బ్యాడ్మింటన్ చాంపియన్స్
బ్యాడ్మింటన్ చాంపియన్స్


